గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: గురువారం, 24 జూన్ 2021 (23:23 IST)

టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా జవహర్ రెడ్డి ప్రమాణస్వీకారం

తిరుమల తిరుపతి దేవస్ధానం స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి వద్ద జరిగిన కార్యక్రమంలో టిటిడి అదనపు ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి వారి చేత ప్రమాణం చేయించారు. అనంతరం టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ కన్వీనర్‌గా ఎ.వి.ధర్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.
 
టిటిడి ఈఓ కె.ఎస్.జవహర్ రెడ్డి వారి చేత ప్రమాణం చేయించారు. ఆ తరువాత ఆలయంలోని సంపంగి ప్రాకారంలో జరిగిన జ్యేష్టాభిషేకంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం రంగనాయకుల మండపంలో టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్ జవహర్ రెడ్డికి, కన్వీనర్ ధర్మారెడ్డికి వేదపండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. 
 
శ్రీవారి తీర్థప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల టిటిడి స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్ కె.ఎస్.జవహర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారి సన్నిధిలో ఈఓగా పనిచేసే అవకాశం కల్పించినందుకు ఆ స్వామికి రుణపడి ఉన్నానని.. ప్రస్తుతం స్పెసిఫైడ్ అథారిటీ ఛైర్మన్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించడం స్వామివారి సంకల్పమని చెప్పారు.
 
గత ధర్మకర్తల మండలి భక్తుల సౌకర్యార్థం అనేక మంచి కార్యక్రమాలు చేపట్టిందని, మరిన్ని ప్రగతిలో ఉన్నాయని కొత్త బోర్డు వచ్చేలోపు వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. సనాతన ధర్మాన్ని బహుళ ప్రచారం చేసేందుకు టిటిడి చర్యలు చేపడుతోందని..ఇక ముందు కూడా విస్తృతంగా ధర్మ ప్రచారం చేస్తామని చెప్పారు.