వైకాపా నేతలకు మాస్ వార్నింగ్ ఇచ్చిన టీడీపీ నేత జేసీ
వైకాపా నేతలకు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమ నిర్మాణాలపై శుక్రవారం జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మను అనంతపురం జిల్లా కలెక్టరేట్లో కలిసి ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణం కూల్చేందుకు 15 రోజుల సమయం ఇస్తున్నానని, ఆ తర్వాత జేసీబీ తీసుకెళామని చెప్పారు.
ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైకాపా నేతల తీరుపై మండిపడ్డారు. తాము తప్పు చేయకపోయినా వైకాపా హయాంలో అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని అన్నారు. వైకాపా నేతల తప్పులపై తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నాలుగు సెంట్ల మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించుకుని ఇల్లు నిర్మించారని, ఆ ఇల్లు కూల్చవద్దంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు.
అదేసమయంలో మాజీ మంత్రి విడదల రజనీపై కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పాపం మాజీ మంత్రి విడదల రజనీ ఎందుకు అంతలా బాధపడుతున్నారో తెలియడం లేదన్నారు. తప్పు చేస్తే జైలుకు వెళ్ళి రావమ్మా... ఏం ఫర్వాలేదు.. తాము కూడా గతంలో జైలుకు వెళ్లి వచ్చామని జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తుచేశారు.