శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (10:41 IST)

అర్థరాత్రి టీడీపీ నేతల అరెస్టు.. వేకువజామున బెయిల్‌పై రిలీజ్

inturibrothers
ఇటీవల నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో ఇంటూరి సోదరులను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. వీరికి శుక్రవారం 5.20 గంటల సమసయంలో న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దీంతో వారు జైలుకు వెళ్లకుండానే విడుదలయ్యారు. 
 
కందుకూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఇంటూరి నాగేశ్వర రావు, నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఇంటూరి రాజేష్‌లు కొనసాగుతున్నారు. అయితే, ఇటీవల కందుకూరులో చంద్రబాబు నాయుడు రోడ్‌‍షో నిర్వహించారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. దీనికి బాధ్యులను చేస్తూ ఇంటూరి సోదరులపై పోలీసులు కేసు నమోదు చేసి, గురువారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత అర్థరాత్రి 1.45 గంటలకు కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. 
 
వీరి అరెస్టు అప్పటికే కందుకూరులోని టీడీపీ నేతలకు తెలిసిపోయింది. దీంతో స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వలేటి శ్రీధర్ నాయుడు సారథ్యంలో అనేక మంది టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని, స్టేషన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. 
 
ఈ క్రమంలో రాత్రి 2.30 గంటలకు హైకోర్టు న్యాయవాదులు కృష్ణారెడ్డి, పారా కిషోర్‌, నరేంద్రబాబు, పాండురంగారావు, మరికొందరు కలిసి ఠాణాకు వచ్చి పోలీసులతో చర్చలు జరపడంతో టీడీపీ నేతలను స్టేషన్‌లోకి అనుమతిచ్చారు. ఈ క్రమంలో ఇంటూరి సోదరులను వైద్య పరీక్షల నిమిత్తం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించి న్యాయమూర్తి పూర్ణిమాదేవి ఇంట్లో హాజరుపరిచారు. వారి వాదనలు ఆలకించిన జడ్జి.. ఇంటూరి సోదరులకు బెయిల్ మంజూరు చేయడంతో వారు విడుదలయ్యారు.