ఇక్కడ భయంగా ఉంది.. వేరే బ్యారక్కు మార్చండి.. వంశీ పిటిషన్
విజయవాడ గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడి కేసుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి జైలులో భయంపట్టుకుంది. దీంతో తనను మరో బ్యారక్లోకి మార్చాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మరోవైపు, తన కిడ్నాప్ కేసులో సత్యవర్థన్ ఎస్సీఎస్టీ కోర్టు మేజిస్ట్రేట్కు వాంగ్మూలం ఇచ్చారు. దీన్ని విజయవాడ ఎస్పీకి కోర్టు అందజేసింది. తన కిడ్నాప్ ఎలా జరిగిందన్న దానిపై సత్యవర్థన్ పూసగుచ్చినట్టు చెప్పారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సత్యవర్థన్ స్టేట్మెంట్ కావాలని కోరుతూ పోలీసులు కోర్టును కోరారు. వారి విన్నపం మేరకు కోర్టు స్టేట్మెంట్ను అందజేసింది.
మరోవైపు, ఈ కేసులో ఏ4గా వీర్రాజు, ఏ10గా ఉన్న వంశీ బాబు అనే నిందితులను విచారించేందుకు రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తనను వేరే బ్యారక్కు మార్చాలని కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు మంగళవారం తీర్పును వెలువరించే అవకాశం ఉంది.