1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 జూన్ 2021 (08:07 IST)

తిరుపతి శివారు ప్రాంతాల్లో చిరుత సంచారం

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో చిరుతల సంచారం ఎక్కువైంది. నగర పరిధిలోని 45వ డివిజన్‌ శివజ్యోతినగర్ సమీపంలోకి ఆదివారం రాత్రి వచ్చిన చిరుతను చూసిన జనం భయంతో హడలిపోయారు. 
 
అడవిలోంచి కాలనీలోకి ప్రవేశించిన చిరుత ఇళ్లపైకి ఎక్కి తిరుగుతూ కనిపించింది. చిరుతను భయటపెట్టేందుకు కొందరు బాణసంచా కాల్చారు. మరికొందరు కర్రలు చేతపట్టుకుని తరిమారు. దీంతో అది అడవిలోకి పరుగులు తీసింది. 
 
గత వారం రోజుల క్రితం కపిలతీర్థం వద్ద రెండు చిరుత పిల్లలు కనిపించిన విషయం తెల్సిందే. ఈ విషయం తిరుపతి అటవీశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ చిరుత పిల్లల కోసం అటవీ శాఖ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఇపుడు ఏకంగా చిరుతపులి సంచారం చేయడం గమనార్హం. 
 
కాగా, ఇటీవలి కాలంలో తిరుపతి, తిరుమలలో చిరుతల సంచారం బాగా ఎక్కువైంది. ముఖ్యంగా నడకదారిలో పలుమార్లు కనిపించిన పులులు భక్తులను భయభ్రాంతులకు గురిచేశాయి. లాక్‌డౌన్ కారణంగా జనసంచారం తగ్గడంతో అవి అడవి నుంచి జనారణ్యంలోకి వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.