1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 16 జులై 2022 (11:07 IST)

ప్రైవేట్ చేతుల్లోకి ఏపీ మద్యం షాపులు

ఏపీలో మద్యనిషేధం అమలు చేసే క్రమంలో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం షాపుల్ని ప్రభుత్వం తమ చేతుల్లోకి తీసుకుంది. ప్రభుత్వం మద్యం వ్యాపారం చేయడమేంటని అంతా విమర్శించినా పట్టించుకోలేదు. 
 
అంతేకాదు తీసుకున్న షాపుల్లో 20 శాతం మూసేసింది. మిగతా షాపుల్లోనూ నగదు రహితంగా చేయాల్సిన వ్యాపారాన్ని నగదుతోనే చేస్తోంది. 
 
మద్యం షాపుల్లో రెగ్యులర్ బ్రాండ్లు తీసేసి నాసిరకం మద్యం బ్రాండ్లను తెచ్చి అమ్ముతోంది. అయినా దీనిపై వచ్చే ఆదాయాన్ని అప్పులు తెచ్చుకునేందుకు హామీగా వాడుకుంటోంది. ఇంత చేస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మరోసారి దీనిపై యూటర్న్ తీసుకునేందుకు సిద్ధమైపోయింది.
 
ప్రభుత్వం గతంలో స్వాధీనం చేసుకున్న మద్యం షాపుల్ని తిరిగి ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేస్తే మంచిదనే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తమవుతోంది. 
 
దీంతో గతంలో వైసీపీ అధికారంలోకి రాగానే తీసుకున్న మద్యం షాపుల్ని తిరిగి వేలం నిర్వహించి ప్రైవేటు వ్యక్తులకు, సంస్ధలకు కట్టబెట్టే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.  
 
ప్రభుత్వం మూడేళ్లుగా నిర్వహిస్తున్న మద్యం వ్యాపారం భారంగా మారుతుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ప్రభుత్వం పెట్టిన రేట్లకు నాసిరకం మద్యాన్ని కొనేందుకు తాగుబోతులు ఇష్టపడటం లేదు. అదే సమయంలో రెగ్యులర్ బ్రాండ్లు మళ్లీ తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. 
 
దీంతో ఆదాయం కూడా పెరగడం లేదు. గతేడాది రూ.25 వేల మద్యం అమ్మితే.. ప్రభుత్వానికి రూ.20 వేల కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యాపారం గిట్టుబాటు కావడం లేదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రైవేటుకు ఇచ్చేస్తే దీనికి రెట్టింపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.