శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 29 జనవరి 2021 (13:08 IST)

డబ్బు కోసం స్నేహితుడి గొంతు కోశాడు.. ఏటీఎం పిన్ నెంబర్ చెప్పమని..?

డబ్బు కోసం ఓ కిరాతకుడు స్నేహితుడినే హతమార్చాడు. కొనఊపిరితో ఉన్న స్నేహితుడ్ని ఏటీఎం పిన్ నెంబర్ చెప్పాలంటూ ఒత్తిడి చేశాడు. ఈ దుర్ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

వివవార్లోకి వెళ్తే.., విజయవాడ చెన్నై మూడో రైల్వే లైన్ ప్రాజెక్టు పనులను జీఆర్ ఇన్ ఫ్రా సంస్థ చేపట్టింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లా బాపట్ల శివారులోని కేబీపాలెం రైల్వే గేటు సమీపంలో జీఆర్ ఇన్ ఫ్రా క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసింది. ఇందులో 150 మందికి పైగా ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. వీరి కంపెనీనే అన్ని సౌకర్యాలు సమకూరుస్తోంది. 
 
ఇదే క్యాంప్‌లో ఛత్తీస్ ఘఢ్‌లోని భిలాయి ప్రాంతానికి చెందిన యువరాజ్ విశ్వకర్మ బాపట్ల- పొన్నూరు మధ్య రైల్వేట్రాక్‌ నిర్మాణ పనులను పర్యవేక్షించే ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. బెంగాల్ లోని ముర్షీదాబాద్‌కు చెందిన అమరజీత్ మండల్ కూడా అక్కడే పంప్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ ఒకేచోట పనిచేస్తుండటంతో ఫ్రెండ్స్ అయ్యారు. విధులు ముగిసిన తర్వాత తరచూ బయటకు వెళ్తుండేవారు. 
 
ఇటీవల ప్రకాశం జిల్లా చీరాల సమీపంలో బైక్ పై వెళ్తుండగా అమరజీత్ ఓ వృద్ధురాలిని ఢీ కొట్టాడు. దీంతో ఆమె మృతి చెందింది. కేసులో రాజీకి రూ.2లక్షలు అవసరమవడంతో యువరాజ్ విశ్వకర్మను డబ్బులివ్వాలని కోరాడు. దీనికి అతడు నిరాకరించాడు.తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో యువరాజ్ విశ్వకర్మపై కోపం పెంచుకున్న అమరజీత్.. అతడ్ని హత్య చేసైనా డబ్బు తీసుకోవాలని ప్లాన్ వేశాడు.
 
ఈ నెల 23న సాయంత్రం సమయంలో పొన్నూరు నుంచి క్యాంప్‌కు వస్తూ భర్తిపూడి వద్ద మద్యం కొనుగోలు చేసి తాగారు. ఈ క్రమంలో డబ్బు కోసం యువరాజ్‌తో అమరజీత్ గొడవ పెట్టుకున్నాడు. అనంతరం తనతో తెచ్చుకున్న కత్తితో యువరాజ్ గొంతుకోశాడు. రక్తపు మడుగులో పడిఉన్న స్నేహితుడ్ని ఏటీఎం పిన్ నెంబర్ చెప్పాలని ఒత్తిడి తెచ్చాడు. అయినా పిన్ నెంబర్ చెప్పకపోవడంతో మరోసారి గొంతుకోసి హతమార్చాడు. మృతదేహాన్ని సమీపంలోని బ్రిడ్జ్ కింద గొయ్యితీసి పాతిపెట్టాడు. మృతుడి దగ్గరున్న సెల్ ఫోన్లను మాయం చేశాడు.
 
యువరాజ్ విధుల్లోకి రాకపోవడం, క్యాంప్‌లో కనిపించకపోవడంతో జీఆర్ సంస్థ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్యాంప్ సమీపంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా.., అమరజీత్‌తో కలిసి బయటకు వెళ్లినట్లు గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. నల్లమడ వాగు వద్ద పాతిపెట్టి మృతదేహాన్ని బయటకు తీయించి పోస్ట్ మార్టంకు తరలించారు. అమరజీత్ పై హత్య కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు.