శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 9 డిశెంబరు 2022 (21:14 IST)

మాండుస్ తుఫాను ఎఫెక్ట్ - కృష్ణాపట్నం పోర్టులో ఆరో నంబరు హెచ్చరిక

mandous cyclone
బంగాళాఖాతంలో కొనసాగుతున్న మాండుస్ తుపాను వాయువ్య దిశగా పయనిస్తుంది. ఇది మహాబలితీరం వైపు దూసుకొస్తుంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న ఈ తుపాను శనివారం వేకువజామున 4 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని  వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. 
 
ఇదిలావుంటే, నెల్లూరు జిల్లా కృష్ణాపట్నం ఓడరేవులో ఆరో నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ తుఫాను ప్రభావం కారణంగా సూళ్లూరుపేట, నెల్లూరు, కావలి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. 
 
తడ మండలం భీములవారి పాళెం వద్ద పులికాట్ సరస్సులో లంగరువేసివున్న మూడు పడవలు నీట మునిగిపోయాయి. అటు బాపట్ల జిల్లా నిజాంపట్న హార్బరులో కూడా మూడో నంబరు ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 
 
ముందుకొచ్చిన సముద్రం.. ఎక్కడ? 
బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా నెల్లూరు జిల్లా మైపాడులో సముద్రం ముందుకు వచ్చింది. ఈ తుపాను ప్రస్తుతం చెన్నైకు 130 కిలోమీటర్లు, తీరం దాటే ప్రాంతంగా అంచనా వేస్తున్న మహాబలిపురానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తుంది. 
 
అయితే, ఈ తుపాను ప్రభావం కారణంగా నెల్లూరు మైపాడు బీచ్ వద్ద సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. పైగా, ఈ ప్రాంతంలో సముద్రం 30 మీటర్ల మేరకు ముందుకు వచ్చింది. తుపాను ప్రభావంతో గాలుల వేగం క్షణం క్షణం పెరిగుతోంది. దీంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. గాలుల తీవ్ర పెరిగిన దృష్ట్యా మైపాడు బీచ్‌‍కు సందర్శకులు రాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.