శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 20 సెప్టెంబరు 2021 (22:11 IST)

మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన మాస్టర్ భువన్: పిన్న వయస్సులో తొలి భారతీయుడు రికార్డు

యూరప్ ఖండంలోనే ఎత్తైన శిఖరంగా పేరుగాంచిన రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించి మాస్టర్ గంధం భువన్ చరిత్ర సృష్టించారు. కేవలం ఎనిమిది సంవత్సరాల మూడు నెలల వయస్సులో భువన్ దీనిని సుసాధ్యం చేసారు. ఈనెల 18వ తేదీన 5642 మీటర్ల ఎత్తెన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని చేరుకున్న అతి పిన్న వయస్కుడైన భారతీయునిగా రికార్డుల సృష్టించారు. ఏమాత్రం అనుకూలత లేని భిన్నమైన వాతావరణంలో ఎంతో శ్రమకోర్చి భువన్ దీనిని సాధించాడు. 
 
చిన్ననాటి నుండే పర్వతారోహణ పట్ల ఎంతో ఆసక్తిని ప్రదర్శించిన భువన్‌కు తల్లిదండ్రులు ప్రోత్సాహం తోడయ్యింది. సీనియర్ ఐఎఎస్ అధికారి, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు కుమారుడైన భువన్ ప్రస్తుతం మూడవ తరగతి చదువుతుండగా, శిక్షకులు అందించిన మెళుకువలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే తాను ఈ రికార్డును సాధించగలిగానన్నారు. అతి శీతల వాతావరణం సవాల్‌గా మారినప్పటికీ, పలు ఇబ్బందులు చవిచూస్తూ అనుకున్న విధంగానే సాహోసోపేతమైన యాత్రను ముగించామన్నారు.
 
కర్నూలు జిల్లా స్వస్థలంగా కలిగిన మాస్టర్ భువన్ చిన్ననాటి నుండి క్రీడలలో ఉత్సాహం ప్రదర్శించగా, కుమారుని ప్రతిభనను గుర్తించిన చంద్రుడు అనంతపురంకు చెందిన స్పోర్ట్స్ కోచ్ శంకరయ్య వద్ద శిక్షణను అందించారు. అనంతపురం జిల్లా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ కోచ్ అయిన శంకరయ్య స్వయంగా పర్వతారోహకుడు కావటంతో భువన్ శిక్షణలో వ్యక్తిగత శ్రద్ధను కనబరిచారు.
 
చిన్నారులకు పర్వతారోహణలో మంచి శిక్షణను అందించే శంకరయ్య తన బృందానికి కడప జిల్లా గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణను కొనసాగించారు. భువనగిరిలోని ట్రాన్సెండ్ ఎడ్వంచర్స్ కోచ్ శంకరబాబు వద్ద కూడా పర్వతారోహహణలో మెళుకువలు నేర్చుకున్న భువన్, రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించే క్రమంలో మాస్టర్ భువన్ సెప్టెంబర్11న భారతదేశం నుండి రష్యాకు బయలుదేరారు.
 
టెర్స్‌కోల్ మౌంట్ ఎల్‌బ్రష్ బేస్‌కు 12న చేరుకున్నారు. అలవాటు కోసం సెప్టెంబర్ 13న 3500 మీటర్లు అధిరోహించి తిరిగి బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. సెప్టెంబర్ 14న 3500 మీటర్లు అవరోహణ చేసి అక్కడే రాత్రి బస చేసారు. 15న 4000 మీటర్ల ఎత్తువద్ద నిర్ధేశించిన శిబిరానికి చేరుకున్నారు. అక్కడే 16, 17 తేదీలలో కొంత శిక్షణ అనంతరం, 18న 5642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వత శిఖరాన్ని చేరుకున్నారు.
 
ప్రస్తుతం ఈ బృందంలోని సభ్యులు పర్వతాన్ని దిగి బేస్ క్యాంప్ కు చేరే ప్రయత్నం జరుగుతుండగా, ఈ నెల 23న ఇండియా తిరిగి రానున్నారు. రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన బృందంలో ఆంధ్రప్రదేశ్ నుండి కోచ్ శంకరయ్య (40), వర్మ (27), కర్నాటక నుండి నవీన్ మల్లేష్ (32) కూడా ఉన్నారు.