1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజయవాడ , సోమవారం, 6 సెప్టెంబరు 2021 (11:37 IST)

వినాయ‌కుడినీ రాజ‌కీయం చేస్తావా? సోము వీర్రాజు నోటికి అదుపు లేదు

సోము వీర్రాజుకు సిద్ధాంతం లేదు.. నోటికి అదుపు లేదు... అని బీజేపీ అధ్య‌క్షుడిని వైసీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు దుయ్య‌బ‌ట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. వినాయక చవితి నేపద్యంలో ప్రభుత్వ నిర్ణయాలపై బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. 
 
 
సోము వీర్రాజు నిత్యం రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు. కేంద్రం నుండి రావాల్సిన నిధులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడటం లేదు అని ఎమ్మెల్యే విష్ణు ఆరోపించారు. ఆగస్టు 28న కేంద్ర హోమ్ శాఖ సెక్రటరీ ఒక జీవో ఇచ్చార‌ని, కోవిడ్ నేపద్యంలో పండుగల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని జీవోలో పేర్కొన్నార‌ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. కరోనా వల్లే వైఎస్సార్ అవార్డులు, ఉపాధ్యాయ దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింద‌ని, స్వాతంత్ర్య దినోత్సవం రోజున కూడా ప్రజలను అనుమతించ లేద‌న్నారు. ప్రజల మేలు కోసమే వినాయక దినోత్సవాన్ని ఇళ్లలో జరుపుకోవాలని సూచించామ‌ని, అన్ని పండుగలకు పోలీసులు మాస్ గేదరింగ్ లు లేకుండా చూస్తున్నార‌ని తెలిపారు. 
 
వ్యాక్సిన్లు, కోవిడ్ టెస్టులపై ఏపీ బీజేపీ నేతలు మాట్లాడర‌ని, మాకు మాత్రం అన్ని మ‌తాలు స‌మాన‌మే అని అన్నారు. గంగా నదిలో, కృష్ణా నదిలో జగన్ పుణ్య స్నానాలు ఆచరించారు... ప్రతి దేవాలయంలో జగన్ భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తారు. రంజాన్, బక్రీద్ పండుగలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇదే జీవోలను ఇచ్చింద‌ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. పోలీసులు హిందువులను అరెస్టు చేస్తారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నార‌ని, గతంలో దేవాలయాల ఘటనపై సీబీఐ ఎంక్వైరీ వేయమంటే కేంద్రం స్పందించలేద‌ని, ఇపుడు నిస్సిగ్గుగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నార‌ని ఆరోపించారు.
 
సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండిస్తున్నామ‌ని, అన్ని సామాజిక వర్గాలను జగన్ సమానంగా చూస్తార‌ని ఎమ్మెల్యే మ‌ల్లాది వివ‌రించారు.