శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 జూన్ 2021 (13:21 IST)

దేశంలో టీకాల కొరతకు ప్రధాని మోడీ సర్కారే కారణం : ఆర్కే రోజా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారును లక్ష్యంగా చేసుకుని సినీ నటి, వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా విమర్శలు గుప్పించారు. దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు కొరత ఏర్పడటానికి మోడీ సర్కారే కారణమని ఆమె ఆరోపించారు. 
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండకుండా... హైదరాబాదులో కూర్చొని ప్రెస్మీట్లు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం నిరంతరం పని చేస్తున్న జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండటం దారుణమని మండిపడ్డారు. 
 
రాష్ట్ర ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ అందలేదని... దీనికి ప్రధాని మోడీ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఏపీకి సరిపడా వ్యాక్సిన్ పంపించాలని ప్రధాని మోడీకి కానీ, కేంద్ర ప్రభుత్వానికి కానీ టీడీపీ అధినేత చంద్రబాబు ఒక్క లేఖ కూడా రాయలేదని విమర్శించారు. 
 
రాష్ట్ర బీజేపీ నేతలు కూడా వ్యాక్సిన్ సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరడం లేదన్నారు. విద్యార్థులకు పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న నారా లోకేశ్‌పై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి ఆయన మాదిరే చవటలా తయారవ్వాలని లోకేశ్ కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.