1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 ఫిబ్రవరి 2024 (13:09 IST)

చంద్రబాబు జైలులో వుంటే పవన్ ఆ పని చేశారు.. ముద్రగడ ఆవేదన

Pawan Kalyan and Mudragada
టీడీపీ- జనసేన సీట్ల వ్యవహారంపై కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన విడుదల చేసిన తొలి జాబితాపై స్పందిస్తూ.. పొత్తులో భాగంగా 80 సీట్లు, రెండున్నరేళ్ల సీఎం పదవి అడగాల్సి వుందని తెలిపారు. కానీ పవన్ అలాంటి సాహసం చేయకపోవడం బాధేస్తుందని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. 
 
చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు టీడీపీ కేడర్ బయటకు రావడానికే భయపడ్డారని... దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారని... అలాంటి సమయంలో మీరు జైలుకు వెళ్లి వారికి భరోసా ఇవ్వడమనేది సామన్యమైన విషయం కాదని ముద్రగడ అన్నారు. 
 
చంద్రబాబు పరపతి విపరీతంగా పెరగడానికి మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనని ముద్రగడ అన్నారు. ప్రజలంతా మిమ్మల్ని ఉన్నత స్థానంలో చూడాలని తహతహలాడారని చెప్పారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం కానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం కానీ తాను ఎప్పుడూ చేయలేదని... ఆ పరిస్థితి రాకుండా చేయమని భగవంతుడిని తరచుగా కోరుకుంటానని తెలిపారు. 
 
పొత్తుల కారణంగా  మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవని... ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని ముద్రగడ అభిప్రాయం వ్యక్తం చేశారు. జన పార్టీ పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదని, రాకూడదని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ముద్రగడ లేఖలో పేర్కొన్నారు. అలానే తన సీటు విషయంపై ముద్రగడ ఆవేదన వ్యక్తం చేశారు.