శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (13:09 IST)

నారా లోకేష్‌ను టార్గెట్ చేసిన నాగబాబు.. ఏబీఎన్ బాగా భజన చేస్తుందే? (Video)

ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల దావోస్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ప్రత్యేక కథనంపై మెగా బ్రదర్ నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


అధికార పార్టీకి ఎలా వత్తాసు పలకాలో, టీడీపీని ఎలా ముందుకు తీసుకెళ్లాలో.. ఏబీఎన్ చక్కగా ఈ ప్రత్యేక కథనం ద్వారా చూపించిందని నాగబాబు భజన చేస్తూ సెటైర్లు విసిరారు. మై చానల్ నా ఇష్టం అంటూ యూట్యూబ్‌లో ఓ ఛానల్‌ను ప్రారంభించిన ఆయన, పలువురిపై ఇప్పటికే సెటైర్లు విసురుతున్న సంగతి తెలిసిందే. తాజా వీడియోలో నారా లోకేష్‌ను టార్గెట్ చేశారు. 
 
లోకేష్‌తో సమావేశమైన ఓ పారిశ్రామికవేత్త ఏపీలో రూ. 5 వేల కోట్లను పెట్టుబడిగా పెట్టనున్నామని మోదీకి చెప్పగా, ఆయన వాటిని గుజరాత్‌లో పెట్టాలని కోరారని, ఢిల్లీ నుంచి అహ్మదాబాద్‌కు బులెట్ రైలు రానుందని మోదీ చెప్పారని ఏబీఎన్‌లో చెప్పడాన్ని ఈ వీడియోలో చూపించారు. మోదీ గారికి వేరే పనీపాటా లేదని.. ఏపీకి వస్తున్న పెట్టుబడులన్నింటినీ గుజరాత్‌కు తరలిస్తున్నారని ఎద్దేవా చేశారు.
 
అలాగే ఏపీ సీఎం చంద్రబాబు బిజీ షెడ్యూల్ కారణంగా ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ను దావోస్ పారిశ్రామిక వేత్తల సదస్సుకు పంపారని చెప్పడంపై కూడా నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తానికి ఏపీకి భారీగా పెట్టుబడులు వచ్చేస్తున్నాయని.. ఈ పెట్టుబడులను ఏపీ సీఎం చంద్రబాబు, నారా లోకేష్ తెచ్చేస్తున్నారని ఏబీఎన్ కథనం ప్రచురించడంపై నాగబాబు సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. 
 
అలా ఏపీకి భారీగా పెట్టుబడులు వస్తుంటే.. ఇక స్పెషల్ స్టేటస్ కావాలని చంద్రబాబు ఎందుకు పట్టుబడుతున్నారని ప్రశ్నించారు. ఏపీ పరిస్థితి అధ్వానంగా వున్నా. ఏబీఎన్ ఛానల్ అధికార టీడీపీకి ఇలా ప్రత్యేక కథనాల ద్వారా బాగానే భజన చేస్తుందని నాగబాబు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.