1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 22 డిశెంబరు 2021 (14:33 IST)

ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్ర‌సాద్ ఫోటో ఎత్తేశారు....

వ‌సంత కృష్ణ ప్ర‌సాద్... ఇపుడు ఆయ‌న మైల‌వ‌రం వైసీపీ ఎమ్మెల్యే. కేపీ అని పిలిచే ఆయ‌న మాజీ హోం మంత్రి వ‌సంత నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు. ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా మొదట్లో మైలవరం నియోజకవర్గంలో కెపిని ఆకాశానికి ఎత్తేశాయి... వైసిపి శ్రేణులు.

 
గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ మంత్రి, సీనియ‌ర్ నాయ‌కుడు దేవ‌నేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుపై ఘన విజ‌యం సాధించిన కేపీకి ఇపుడు సొంత నియోజ‌క‌వ‌ర్గంలోనే అస‌మ్మ‌తి మొద‌లైంది. సరిగ్గా రెండున్నర ఏళ్లు తిరగక ముందే స్థానిక వైసీపీ నేత‌లు తమ బ్యానర్లలో నుండి ఏకంగా కెపి ఫోటోనే లేకుండా ఎత్తేశారు.

 
ఔరా ఏమిటి హతవిధీ అంటూ మైలవరం నియోజకవర్గంలో ప్ర‌జ‌లు ముక్కున వేలు వేసుకుంటున్నారు.  ఇదంతా మార్పులో భాగమా? లేక కెపి పైన వచ్చిన వ్యతిరేకతా? అంటే ఇదంతా వైసిపిలో కెపి పైన లేచిన అసమ్మతి కెరటంగానే భావిస్తున్నారు.

 
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకల సాక్షిగా మైలవరంలో అస‌మ్మ‌తి సెగ గుప్పుమంది. ఇబ్రహీంపట్నంలో సైతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు ఘనంగానే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, వేములకొండ రాంబాబు, మండల కన్వీనర్ బొమ్మ సాని చలపతిరావు, రాష్ట్ర నాయకులు మేడపాటి నాగిరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు కోమటి కోటేశ్వరరావు, జి.కొండూరు జడ్పిటిసి మందా చక్రధరరావు తదితరులు పాల్గొన్నారు. 
 
 
ముఖ్యమంత్రి వైయస్ జగన్ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాదు  ఫోటో లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది చూస్తే చాలదా? మైలవరం నియోజకవర్గం లో కెపి పైన అసమ్మతి సెగ ఏ మేర ఉందో అర్థం అవడానికి!