శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 16 మార్చి 2022 (07:50 IST)

ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జోహారు : నాగబాబు

పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెంలో సంభవించిన కల్తీసారా మృతులపై సినీ నటుడు నాగబాబు స్పందించారు. కల్తీ సారా మృతులను సహజ మరణాలుగా చిత్రీకరించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి జోహారు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఆయన జంగారెడ్డి గూడెంలో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "డాక్టర్లు, మీడియా స్థానకుల మాదిరే నేను కూడా మొదట వీటిని కల్తీ సారా మరణాలే అని పరిగణించాను. కానీ మన జగన్ రెడ్డి గారు తన ప్రత్యేక డిక్షనరీ సాయంతో వీటిని సహజ మరణాలుగా ధృవీకరించడంతో ఊపిరి పీల్చుకున్నాను. 
 
అందరూ ఒకే ప్రాంతానికి చెందినవారైనా, అందులో మరణించిన వారందరూ కేవలం మగవాళ్లే అయినా వీరందరూ తమ కంటి చూపులు కోల్పోయి, కడుపులోని అవయవాలన్నీ కోల్పోయి ఉన్నా అందరూ ఒకే విధంగా గంటల వ్యవధిలో హఠాన్మరణానికి గురైనా ఈ చావులకు కల్తీ సారాకు ఎలాంటి సంబంధం లేదని, ఇవన్నీ సహజ మరణాలుగా నిర్ధారించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిగారికి జోహారు. ఇలా ఇంకా ఎంతమంది చనిపోయినా మనం వీటిని కేవలం సహజ మారణాలుగా పరిగణించాల్సి రావడం ఆంధ్రులకు పట్టిన దుస్థితి" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.