శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr

తప్పుడు ప్రచారం చేయడం పవన్‌కు ఫ్యాషనైపోయింది : నారా లోకేశ్

తమపైనా, తెలుగుదేశం పార్టీపైనా తప్పుడు ప్రచారం చేయడం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఫ్యాషనైపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.

తమపైనా, తెలుగుదేశం పార్టీపైనా తప్పుడు ప్రచారం చేయడం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఫ్యాషనైపోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు.
 
రూ.వందల కోట్లు విలువ చేసే ఫైబర్‌ గ్రిడ్‌ కాంట్రాక్ట్‌‌ను హెరిటేజ్ సభ్యుడికి ఇచ్చారన్న పవన్ వ్యాఖ్యలపై లోకేశ్ స్పందించారు. ఆరోపణలు చేసేవారు వాస్తవాలు తెలుసుకోవాలని ఇప్పటికే చెప్పానని ఆయన అన్నారు. ఫైబర్‌‌గ్రిడ్‌ కాంట్రాక్ట్‌ హరిప్రసాద్‌కు కట్టబెట్టారని అంటున్నారని, హరిప్రసాద్‌ హెరిటేజ్‌ సభ్యుడని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆధారాలు లేని ఆరోపణలు చెయ్యొద్దని లోకేశ్ సూచించారు.
 
అలాగే, గురువారం వెల్లడైన ఉప ఎన్నికల ఫలితాలపై కూడా ఆయన స్పందించారు. బీజేపీ ఆధిపత్య ధోరణి, మోసపూరిత విధానాలను ప్రజలు తిరస్కరించారని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ఎప్పుడో కనుమరుగైందని, ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి ముఖం చూపించలేని పరిస్థితి వచ్చిందని జోస్యం చెప్పారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఇకనైనా మేల్కోవాలని సూచించారు. 
 
కాగా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, నాగాలాండ్ రాష్ట్రాల్లోని నాలుగు లోక్‌సభ స్థానాలతోపాటు దేశవ్యాప్తంగా 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నిక ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. ఈ ఉప ఎన్నికల్లో విపక్షాల ఐక్యతతో బీజేపీకి ఎదురుగాలి తగిలింది. మూడు లోక్‌సభ సిట్టింగ్‌ స్థానాల్లో ఒకే స్థానాన్ని మాత్రమే బీజేపీ నిలబెట్టుకుంది. 11 అసెంబ్లీ స్థానాల్లో 10 చోట్ల విపక్షాల హవా కొనసాగింది.