శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 4 మే 2020 (17:30 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో "జగనన్న బీరు పండుగ" : లోకేశ్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న బీరు పండుగ ఘనంగా ప్రారంభమైందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సెటైర్లు వేశారు. ఫలితంగా అనేక మద్యం దుకాణాల ఎదుట మందుబాబులు బారులు తీరారని గుర్తుచేశారు. 
 
కేంద్రం ఇచ్చిన సడలింపులతో గ్రీన్, ఆరెంజ్ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. అయితే, ఒక దుకాణం ఎదుట ఐదుగురు కంటే ఎక్కువ జనం గుమికూడితే మద్యం దుకాణం మూసివేయాలని, పైగా, ఖచ్చితంగా సామాజిక భౌతిక దూరాన్ని పాటించాలని కేంద్రం షరతు విధించింది. కానీ, మద్యం దుకాణాల ఎదుట ఇవేమీ మచ్చుకైనా కనిపించలేదు. 
 
అనేక ప్రాంతాల్లో నిబంధనలు పాటించకుండా తాగుబోతులు క్యూలైన్లలో ఒకరినొకరు తోసుకుంటూ నిలుచోవడం దర్శనమిచ్చింది. ఈ వ్యవహారంపై నారా లోకేశ్ స్పందించారు. రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో 'జగనన్న బీరు పండుగ' ఘనంగా ప్రారంభమైందని ఎద్దేవా చేశారు.
 
మద్య నిషేధం మాటున చీకటి దందా సాగుతోందని ఆరోపించారు. మద్య నిషేధం అంటే రేట్లు పెంచడం, వైన్ కేసుల్లో కమీషన్లు తీసుకుని ప్రమాదకరమైన లిక్కర్ విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడమని వైఎస్ జగన్ సరికొత్త అర్థం చెప్పారని లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. 
 
లాక్‌డౌన్ సమయంలో వైసీపీ ఎలుకలు తాగిన కోట్ల రూపాయల మద్యం లెక్కలు సరిచేసేందుకే లిక్కర్ అమ్మకాలకు పచ్చజెండా ఊపారని ఆరోపించారు. పేరుకు మాత్రం సంపూర్ణ నిషేధం అమలు చర్యల్లో భాగంగానే మద్యం ధరలు పెంచినట్టు బుకాయిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.