మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 7 జూన్ 2024 (11:03 IST)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్

neerabh kumar prasad
సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వణికిపోతున్నారు. ముఖ్యంగా, గత ఐదేళ్ల కాలంలో అధికార వైకాపా నేతలతో అంటకాగిన బ్యూరోక్రాట్లపై కొత్త ప్రభుత్వ పాలకులు గుర్రుగా ఉన్నారు. దీంతో వారు భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లేలా ఆదేశించిన ప్రభుత్వం.. ఇపుడు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరభ్ కుమార్‌ను నియమించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. 
 
ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన నీరభ్... 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. తాజాగా నీరభ్ కుమార్ ప్రసాద్‌ను సీఎస్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డిని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. నీరభ్ కుమార్ ప్రస్తుతం రాష్ట్ర పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక బుధవారం నీరభ్ కుమార్ బుధవారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి వెళ్లిన విషయం తెల్సిందే.
 
మరోవైపు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గర పడుతుండడంతో సీఎంఓ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర సీఎంఓ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. ఆయనను ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది.