1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 30 జనవరి 2021 (10:37 IST)

నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారు: సజ్జల

ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ పరిధి దాటి ప్రవర్తించడంతోనే తాము తిరిగి ప్రశ్ని్స్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అలా ప్రశ్నించడం రమేశ్‌కుమార్‌కు నచ్చడం లేదని.. లేని అధికారాలను వినియోగించి తమను తప్పించాలని చూస్తున్నారని ఆక్షేపించారు.

నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తాను ప్రభుత్వ సలహాదారు కాకముందు వైకాపా ప్రధాన కార్యదర్శినని.. పార్టీ అధ్యక్షుడికి రాజకీయ కార్యదర్శిగా గత పదేళ్ల నుంచి ఉన్నానని చెప్పారు. ప్రభుత్వ సలహాదారుగా ఉంటే రాజకీయాలు మాట్లాడకూడదనే అంశం ఎక్కడ నుంచి వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. 
 
ఎస్‌ఈసీ తన పరిధి దాటి అధికారులను ఆదేశిస్తున్నారని.. ఆయన శైలి అభ్యంతరకరం, ఆక్షేపణీయమని చెప్పారు. తెదేపా అధినేత చంద్రబాబు ఏజెంట్‌గా నిమ్మగడ్డ వ్యవహరించారని సజ్జల ఆరోపించారు. 2018లో జరగాల్సిన ఎన్నికలను 2020 వరకు ఎందుకు జరపలేదని ప్రశ్నించారు.

ఎన్నికలను తామెప్పుడూ వ్యతిరేకించలేదని.. వాటికి సదా సిద్ధమని చెప్పారు. తానెక్కడ కూర్చొని మాట్లాడాలో నిర్దేశించి హక్కు ఎస్‌ఈసీకి లేదన్నారు. నిమ్మగడ్డ ఎస్‌ఈసీ స్థానంలో కూర్చొని రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.