బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జులై 2020 (12:29 IST)

మొట్టికాయాలు పడుతున్నా మారరా? నిమ్మగడ్డ కేసులో ఏపీ సర్కారుపై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం మరోమారు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎందుకు తిరిగి నియమించలేదంటూ నిలదీసింది. ఈ కేసులో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించేందుకు నిరాకరించినప్పటికీ.. నిమ్మగడ్డను మళ్లీ ఎస్ఈసీగా ఎందుకు తిరిగి నియమించలేదని సూటిగా ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై ఒక అఫిడవిట్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్‌ను ఆదేశిస్తూ వచ్చే శుక్రవారానికి ఈ కేసును వాయిదావేసింది. 
 
మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ వేయగా, దీనీపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే గవర్నర్‌ను కలిసి హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా ఒక వినతిపత్రం ద్వారా కోరాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది. 
 
తాము ఇచ్చిన తీర్పు ప్రకారం ఎన్నికల కమిషనర్‌ను నియమించే అవకాశం గవర్నర్‌కు ఉందని చెప్పామని.. సుప్రీంకోర్టులో మూడు సార్లు విచారణ జరిగినా స్టే రాలేదని రమేష్ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 
 
స్టే ఇవ్వలేదు కాబట్టి, తాము ఇచ్చిన తీర్పు అమల్లో ఉన్నట్లేనని హైకోర్టు పేర్కొంది. ధర్మాసనం తీర్పు అమలు జరపాల్సిందేనని, ఈలోపు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్‌ను కలిసి విజ్ఞప్తి చేయాలని కోర్టు సూచించింది. అనంతరం వచ్చే శుక్రవారానికి విచారణను వాయిదా వేసిన హైకోర్టు... కోర్టు ఆదేశాలను ఎందుకు పాటించలేదో వివరిస్తూ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.