బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Updated : బుధవారం, 20 మే 2020 (23:06 IST)

తిరుమల శ్రీవారి దర్శనం లేదు, కానీ ఇ-హుండీకి భక్తులు కోటీ 97 లక్షలు - video

తిరుమల శ్రీవారి భక్తులు ఎంతో భక్తిభావంతో తినే స్వామివారి ప్రసాదం రేటును టిటిడి తగ్గించింది. చిన్న లడ్డూను ఇప్పటివరకు ఒక్కొక్కటి 50 రూపాయలకు విక్రయించేవారు. కానీ ఆ ధరను 25 రూపాయలకు తగ్గిస్తూ టిటిడి నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భక్తులకు కావాల్సినన్ని లడ్డూలను అందుబాటులోకి తీసుకురాబోతోంది.
 
ఎల్లుండి నుంచి లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉండనున్నాయి. ఎపిలోని టిటిడి కళ్యాణ మండపాల్లో లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే 3 నుంచి 4 లక్షల లడ్డూలను ప్రతిరోజు తయారుచేస్తున్నట్లు టిటిడి ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి భక్తుల కోరిక మేరకు లడ్డూలను అందిస్తున్నట్లు.. అది కూడా తక్కువ రేటుకే ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు టిటిడి ఛైర్మన్ చెప్పారు.
 
ముఖ్యంగా ఈ-హుండీ ద్వారా ఎవరైతే స్వామివారికి మ్రొక్కుల రూపంలో నగదును చెల్లిస్తారో వారికి మొదటి ప్రాధాన్యత ఇస్తామన్నారు. అవసరాన్ని బట్టి భక్తులకు 5 వేల లడ్డూల వరకు అందజేస్తామన్నారు. శ్రీవారి దర్సనం తిరిగి ప్రారంభమయ్యేంతవరకు భక్తులకు లడ్డూలు అందుబాటులో ఉంటాయన్నారు. శ్రీవారి భక్తులకు దర్సనం కల్పించకపోయినా ఈ-హుండీ ద్వారా కోటి 97 లక్షల రూపాయల ఆదాయం ఈ యేడాది వచ్చినట్లు టిటిడి ఛైర్మన్ తెలిపారు. 
 
శ్రీవారి దర్సనం ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడే చెప్పలేమని.. టిటిడి కాంట్రాక్ట్ కార్మికులకు నెల నెలా సరైన రీతిలో జీతాలను అందజేస్తున్నట్లు చెప్పారు. జీతాలు ఇవ్వలేనంత దీనస్థితిలో టిటిడి లేదని టిటిడి ఛైర్మన్ స్పష్టం చేశారు.