శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (16:26 IST)

పవన్ కళ్యాణ్‌ను కలిసిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి!!

magunta - pawan
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో ఒంగోలు సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం కలుసుకున్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తన కుమారుడు మాగుంట రాఘవతో కలిసి వచ్చి మర్యాదపూర్వకంగా పవన్‌ను కలుసుకున్నారు. పవన్‌త ఆయన పలు అంశాలపై చర్చించారు. వీరి వెంట ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు. మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇటీవల వైకాపాకు రాజీనామా చేసి టీడీపీలో చేరిన విషయం తెల్సిందే. 
 
అలాగే, తిరుపతి ఎంపీ స్థానం నుంచి పోటీ చేయనున్న బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా (గూడూరు సిట్టింగ్ ఎమ్మెల్యే) పవన్ కళ్యాణ్‌తో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులు, పొత్తు నేపథ్యంలో సమన్వయం, ఓట్ల బదిలీ తదితర అంశాలపై వారు చర్చించినట్టు తెలుస్తుంది. గత ఎన్నికల్లో వైకాపా తరపున గూడూరు అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన వరప్రసాద్ కొన్ని రోజుల కిందటే వైకాపాకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెల్సిందే. ఈయనకు బీజేపీ అధిష్టానం తిరుపతి ఎంపీ టిక్కెట్‌ను కేటాయించింది. 

మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను ప్రారంభించిన సీఎం జగన్ 
 
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బుధవారం నుంచి 21 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్ర కడప జిల్లా ఇడుపులపాయ నుంచి బయలుదేరింది. వైఎస్ఆర్ ఘాట్‌కు తన తల్లి విజయమ్మతో కలిసి నివాళులు అర్పించిన జగన్... ఆ తర్వాత బస్సు యాత్రను ప్రారంభించారు. తొలి రోజు రాత్రికి ఆయన నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో బస చేస్తారు. 
 
తొలిరోజు బస్సు యాత్ర ఇడుపులపాయ, వేంపల్లి, వీరపునాయుని పల్లి, ఉరుటూరు, సున్నపురాళ్లపల్లి, ప్రొద్దుటూరు, యర్రగుంట్ల, దువ్వూరు, చాగలమర్రి, ఆళ్ళగడ్డ వరకు సాగుతుంది. అంతకుముందు తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఇందులో తన తల్లి విజయమ్మ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌కు తల్లి విజయమ్మ ముద్దుపెట్టి, ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు. యాత్రకోసం సిద్ధంగా ఉన్న బస్సులోకి జగన్, వైఎస్ అవినాశ్ రెడ్డి, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, కడప జిల్లా నేతలు ఎక్కారు.