గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 23 సెప్టెంబరు 2019 (14:59 IST)

అమ్మతోడు.. మా ఇంట్లో దొరికింది 12 లక్షలేనంటున్న శేఖర్ రెడ్డి...

సాధారణంగా చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేస్తే అమ్మతోడు.. లేకుంటే ప్రామిస్ అంటూ ముద్దుముద్దుగా చెబుతుంటారు. దీన్ని విని పెద్దవారు తెగ సంతోషపడిపోతుంటారు. కానీ అదే అబద్ధాన్ని పెద్దవారు చెబితే మాత్రం కోపమొస్తుంది కదూ. మరి అలాంటి పనే చేస్తున్నారు టిటిడి ప్రత్యేక ఆహ్వానితులు శేఖర్ రెడ్డి.
 
ఈయన గురించి అస్సలు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తమిళనాడు ఒక్కటే కాదు దక్షిణాది రాష్ట్రాల్లో ఈయన బాగా ఫేమస్. ఆమధ్య కాలంలో హవాలా మనీ కుంభకోణంలో శేఖర్ రెడ్డి పట్టుబడ్డారు. అరెస్టయ్యారు. తన ఇంట్లో కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆయన్ను అప్పట్లో టిటిడి పాలకమండలి సభ్యుని పదవి నుంచి తొలగించేశారు. అప్పట్లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఆశీస్సులతో ఆయనకు ఆ పదవి దక్కింది.
 
కానీ శేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో ఆ పదవి పోయింది. ఆ తరువాత కూడా టిటిడి కోసం రకరకాల ప్రయత్నం చేశారు శేఖర్ రెడ్డి. కొత్త ప్రభుత్వం వచ్చింది. దీంతో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమింపబడ్డారు. ఆయన తిరుమలలో బాధ్యతలు కూడా చేపట్టారు. తనపై కొంతమంది కావాలనే దుష్ర్పచారం చేశారని, హవాలా మనీ కేసులో కేవలం తన దగ్గర 12 లక్షలు మాత్రమే దొరికిందని, అయితే కొంతమంది వందకోట్లు లభించిందని తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. 
 
అంతేకాదు ఇదంతా నిజమే.. ప్రామిస్ అంటూ చిన్న పిల్లాడిలా ఆయన మాట్లాడటం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా కెమెరాలు అన్నీ స్విచ్ ఆఫ్ చేసిన తరువాత చిన్నపిల్లాడిలాగా ప్రామిస్ అంటూ ఆయన చెప్పడం ప్రారంభించారు.