1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 జూన్ 2023 (09:48 IST)

అయ్యా శీనయ్యా.. నువ్వైనా రోడ్లు వేయించయ్యా.. టీడీపీ నేతకు వైకాపా కౌన్సిలర్ వినతి

tdp logo
"అయ్యా శీనయ్యా.. నువ్వైనా రోడ్లు వేయించయ్యా.. టీడీపీ నేతకు వైకాపా కౌన్సిలర్ వినతి" ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైకాపా నేతల దుస్థితి. అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క పని కూడా చేయించలేని ఉత్సవ విగ్రమూర్తులుగా మిగిలిపోయారు. తమ వార్డులో పనులు చేయించాలంటూ చివరకు విపక్షమైన టీడీపీ నేతలను ప్రాధేయపడుతున్నారు. తాజాగా ఓ వైకాపా మహిళా కౌన్సిలర్ టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాస రావును ఇదే విధంగా అడుక్కున్నారు. 
 
ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం 27వ వార్డు వైసీపీ కౌన్సిలర్ తురకా ముక్కంటి భార్య పద్మావతి మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుకు ఓ విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం పట్టణంలోని 26, 27వ వార్డుల్లో "భవిష్యత్‌కు గ్యారెంటీ" అనే కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నేత యరపతినేని.. రజక కాలనీ, యరపతినేని నగర్, భవానీనగర్‌లో పర్యటించారు. 
 
ఈ సందర్భంగా ఆయన ప్రజల సమస్యలు తెలుసుకుంటుండగా అక్కడే ఉన్న వైసీపీ కౌన్సిలర్ ముక్కంటి భార్య పద్మావతిని కూడా యరపతినేని ఆప్యాయంగా పలకరించారు. దీంతో పద్మావతి "ఇప్పుడు ఎటూ అభివృద్ధి లేదు... మీరైనా రేపటి రోజున మా వార్డులో రోడ్లు వేయండయ్యా" అన్నారు. కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పినా పట్టించుకోవడం లేదని పద్మావతితో పాటు మరికొందరు మహిళలు గొంతు కలిపారు.
 
భవిష్యతు గ్యారంటీ పథకా లైన మహిళాశక్తి, దీపం, బీసీలకు రక్షణ చట్టం, మహిళలకు ఉచిత ప్రయాణం, తల్లికి వందనం గురించి యరపతినేని వివరిస్తుండగా.. వార్డులోని కొందరు మహిళలు ఒక్కచాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ ఏమీ చేయలేకపోయా రని, చంద్రబాబు ప్రకటించిన భవిష్యత్‌కు గ్యారెంటీ పథకాలతో ఈసారి జగన్ కొట్టుకుపోవడం ఖాయమని శాపనార్థాలు పెట్టారు. 
 
ఆ తర్వాత యరపతినేని మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. విద్యుత్ సంక్షోభం నుంచి రాష్ట్రం గద్దెక్కాలన్నా, నిత్యవసరాల ధరలు అదుపులో ఉండాలన్నా తెలుగుదేశం అధికారంలోకి రావాలన్నారు.