1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 ఫిబ్రవరి 2021 (13:53 IST)

నిమ్మగడ్డ ఆదేశాలను బేఖాతరు.. బాబు కోసమే పనిచేస్తున్నారు.. పెద్దిరెడ్డి

Pedhi Reddy
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను ఏపీ మంత్రులు టార్గెట్ చేస్తున్నారు. ఆయనపై మంత్రులు, వైసీపీ నేతలు మూకుమ్మడి దాడికి దిగుతున్నారు. నిమ్మగడ్డ చర్యలను ఎప్పటికప్పుడు తప్పుబడుతున్నారు. కొన్ని సందార్భాల్లో ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు.

నిమ్మగడ్డపై మాటల దాడి చేయడంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. ఎందుకంటే ఆయన పంచాయతీరాజ్ శాఖా మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. అందువల్లే పెద్దిరెడ్డి దృష్టంతా నిమ్మగడ్డపైనే ఉంది.
 
ఈ నేపథ్యంలో పంచాయతీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ షాక్ ఇచ్చారు. పెద్దిరెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలని డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. మంత్రి మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని ఎస్‌ఈసీ తేల్చిచెప్పింది.

ఎన్నికలు నిజాయితీగా, నిష్పక్షపాతంగా జరిగేందుకే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. ప్రజలు నిర్భయంగా ఓటేసేందుకే ఈ చర్యలు తీసుకుంటుంన్నామని ఎస్‌ఈసీ పేర్కొంది.
 
ఈ నేపథ్యంలోనే శుక్రవారం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఆదేశాల్ని ఖాతరు చేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. మంత్రిని ఇంట్లో పెట్టాలనే ఆలోచన దుర్మార్గమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసమే నిమ్మగడ్డ పనిచేస్తున్నారని ఆరోపించారు. తనపై ఆదేశాలు ఇచ్చే ముందు అమలవుతాయో లేదో చూసుకోవాలని, అధికారులు నిర్భయంగా పనిచేయాలని పెద్దిరెడ్డి చెప్పారు.
 
'రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ మాటలు విని ఏకపక్షంగా వ్యవహరించే అధికారులను.. మా ప్రభుత్వం ఉన్నన్ని రోజులూ బ్లాక్‌ లిస్ట్‌లో పెడతాం. ఏకగ్రీవమైన అభ్యర్థులకు డిక్లరేషన్‌ ఇవ్వని అధికారుల పేర్లు తీసుకుని.. మార్చి 31 తర్వాత గుణపాఠం నేర్పుతాం' అని పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు.