శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 19 నవంబరు 2021 (16:18 IST)

సాగు చట్టాలపై రాజనీతిని ప్రదర్శించిన ప్రధాని మోడీ : పవన్ కళ్యాణ్

వివాదాస్పద మూడు సాగు చట్టాల రద్దు విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజనీతిని ప్రదర్శించారని జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అన్నారు. యేడాదిన్నర క్రితం కేంద్ర మూడు సాగు చట్టాలను ప్రవేశపెట్టింది. ఇవి రైతు ప్రయోజనాలను హరించేవిలా ఉన్నాయని పేర్కొంటూ దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలకు దిగారు. అప్పటి నుంచి వారు ఆందోళన చేస్తూనే వున్నారు. 
 
ఈ క్రమంలో శుక్రవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ ఈ సాగు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో రద్దు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదిస్తామని తెలిపారు. ఈ నిర్ణయాన్ని అన్ని రాజకీయ పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ప్రధాని మోడీ ప్రసంగాన్ని పరిశీలిస్తే, జనవాక్కును శిరోధార్యంగా భావించినట్టుగా ఉందన్నారు. గత యేడాదికి పైగా ఆందోళన చేసిన రైతులకు దక్కిన ఫలితంగా భావించాలన్నారు. ఇది మంచి శుభపరిణామం అని అన్నారు. 
 
పోరాడితే సాధ్యం కానిది ఏదీ లేదని రైతుల ఉద్యమంతో నిరూపితమైందన్నారు. రైతుల పోరాటాన్ని రాజకీయ కోణం నుంచి కాకుండా ఒక సామాజిక అంశంగా భావించి ఈ సాగు చట్టాలను ఉపసంహరించుకోవడానికి నిర్ణయం తీసుకున్న బీజేపీ నాయకత్వానికి కృతజ్ఞతలు అంటూ పవన్ కామెంట్స్ చేశారు.