శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 14 అక్టోబరు 2020 (20:49 IST)

విజ‌య‌వాడ లో‌త‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు పున‌రావాస కేంద్రాల‌కు వెళ్లాలి

ఎగువ ప్రాంతాల నుండి అధిక మొత్తంలో ప్రకాశం బ్యారేజికి వరద నీరు వస్తున్న దృష్ట్యా లోతట్టు ప్రాంతాల నివాసాల వారందరూ అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్తగా నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల‌కు తరలి రావాలని విజ‌య‌వాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ పిలుపునిచ్చారు.

నగర పర్యటనలో భాగంగా కమిషనర్ బుధ‌వారం ఆయ‌న కృష్ణానది పరివాహక లోతట్టు ప్రాంతాలైన రామలింగేశ్వరనగర్, తారకరామానగర, భుపేష్ గుప్తానగర్, కృష్ణలంక కరకట్ట, తదితర వరదనీటి ముంపున‌కు గురైన ప్రాంతాలను నుండి సుమారు 800 మందిని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల‌కు తర‌లించారు.

అక్కడ బాధితులకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను కమిషనర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు ఇచ్చారు.

ఈ సందర్భంలో క్షేత్ర స్థాయి అధికారుల నిరంతర పర్యవేక్షణలో హ్యాండ్ మైక్ ప్రచారం ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ, లోతట్టు ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారిని తరలించేందుకు అందుబాటులో ఉంచిన 7 వాహనాల‌ను సద్వినియోగం చేసుకుని ఇందిరాగాంధీ స్టేడియంతో పాటుగా ఆయా పరిసర ప్రాంతాలలోని 10 పాఠశాలలో అందుబాటులో ఉంచిన పునరావాస కేంద్రములకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పునరావాస కేంద్రంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మరియు బాధితులందరికి త్రాగునీరు, మురుగుదొడ్లు అందుబాటులో ఉంచి  బోజన సౌకర్యం కల్పించాలని మరియు అన్ని పునరావాస కేంద్రములలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి 24 గంటలు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచి బాధితులకు అవసరమగు వైద్య సేవలను అందించాలని ఆదేశించారు.

విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచుకొనుటతో పాటుగా విధిగా ప్రతి ఒక్కరు మాస్క్ లు, చేతి గ్లౌజులు, శానిటైజర్ వంటి వాటిని అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు,

ఈ సందర్భంలో నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం నందు కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి 3 షిఫ్ట్ లలో సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉంచినట్లు మరియు ప్రజలు వారి ప్రాంతాలలో గల సమస్యలను నేరుగా ల్యాండ్ లైన్ నెం. 0866-2424172 మరియు వాట్సప్ నెం 8181960909 ఫోన్ ద్వారా తెలియజేయాలన్నారు.

కార్యక్రమంలో అదనపు కమిషనర్(జనరల్) మోహనరావు, డిప్యూటీ కమిషనర్ రెవిన్యూ వెంకట లక్ష్మి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.