గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 1 మే 2019 (10:03 IST)

పెను తుఫానుగా మారిన ఫణి : అతితీవ్రరూపందాల్చి దూసుకొస్తోంది..

ఫణి తుఫాను తీవ్రరూపం దాల్చింది. ఒక్కసారిగా అది తీవ్రరూపందాల్చి తీరంవైపు దూసుకొస్తోంది. ఈ తుఫాను ఇపుడు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. విశాఖకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 510 కి.మీ.ల దూరంలో, ఒడిశాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా 730 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైవుంది. 
 
ఈ తుఫాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయవ్య దిశగా పయనిస్తున్న ఈ పెను తుఫాను బుధవారం ఉదయానికి మలుపు తిరిగి ఉత్తర ఈశాన్య దిశ వైపు పయనించనుంది. క్రమంగా అదే దిశలో కదులుతూ ఒడిశాలోని గోపాల్‌పూర్-చాంద్‌బాలీల మధ్య దక్షిణ పూరీకి సమీపంలో మూడో తేదీ మధ్యాహ్నం పెను తుఫానుగానే తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. 
 
ఆ తర్వాత అది పశ్చిమ బెంగాల్‌ మీదుగా పయనించి బంగ్లాదేశ్‌లో మే 5వ తేదీన వాయుగుండంగా బలహీనపడనుందని వివరించింది. ఫణి పెను తుఫాను ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ప్రభావం చూపనుందని ఐఎండీ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఈ రెండు జిల్లాల్లో పెనుగాలుల ఉధృతితో పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 
 
ఈనెల 4వ తేదీ వరకు తుఫాను ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని వివరించింది. పెను తుఫాను ప్రభావంతో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారుతుంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, తమ బోట్లను సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఐఎండీ సూచించింది. 
 
మరోవైపు.. పెను తుఫాను తీవ్రత దృష్ట్యా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నంబరు, కాకినాడలో 4, గంగవరం పోర్టులో 5వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు.