1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్

మాజీ మంత్రి పేర్ని నాని చీకటి వ్యాఖ్యలు - అవనిగడ్డలో కేసు నమోదు

perni nani
మాజీ మంత్రి, వైకాపా నేత పేర్ని నాని చిక్కుల్లో పడ్డారు. వైకాపా కార్యకర్తల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీంతో ఆయనపై అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో జరిగిన వైసీపీ సమావేశాల్లో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత కనపర్తి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయని పేర్కొన్నారు.
 
పేర్ని నాని తన ప్రసంగంలో, "రప్పా రప్పా అని కేకలు వేయడం కాదు... చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. ఏదైనా చేయాలంటే నిశ్శబ్దంగా చేయండి, అరవకండి" అని అన్నారు. ఈ వ్యాఖ్యలను రహస్యంగా రాజకీయ హింసకు ప్రోత్సాహించేలా ఉన్నాయని టీడీపీ నాయకులు ఆరోపించారు. 
 
ఈ ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అవనిగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ, జనసేన నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ ఉద్రిక్తతలను పెంచి, హింసను రెచ్చగొట్టే అవకాశం ఉందని వారు హెచ్చరించారు.
 
కనపర్తి శ్రీనివాసరావు తన ఫిర్యాదులో పేర్ని నానిని 'రైస్ స్కామ్ స్టర్'గా పేర్కొన్నారు, ఆయన వ్యాఖ్యలు సమాజంలో అరాచకాన్ని సృష్టించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దీంతో అవనిగడ్డ పోలీసులు కేసు నమోదు చేశారు.