1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 12 జనవరి 2022 (18:35 IST)

రైతు ద్రోహి వైయస్ జగన్మోహన్ రెడ్డి- ధూళిపాళ్ళ నరేంద్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు ద్రోహిగా మారారని, ఆయన సారధ్యంలో నడిచే ప్రభుత్వంలోని మంతులు, ఎం‌ఎల్‌ఏల తోపాటు వైకాపా నాయకులు రైతులపై కక్షసాదింపులకు దిగుతున్నా పట్టించుకోవటం లేద‌ని టి‌డి‌పి సీనియర్ నేత, పొన్నూరు మాజీ శాసనసభ్యుడు ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం రైతులనుంచి సకాలంలో దాన్యం సేకరించకుండా ఇబ్బందులపాలు చేస్తున్న నేపధ్యంలో పొన్నూరు మండలం బ్రాంహ్మణకోడూరు అడ్డరోడ్డు వద్ద పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ నాయత్వంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. 
 
 
రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నా వాటిని పండిస్తున్న రైతులకు మాత్రం కనీస గిట్టుబాటు ధర అందడం లేదన్నారు. పండిన పంటలకు గిట్టుబాటు ధర అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు  అప్పుల పాలవుతున్నారని చెప్పారు. పంటలు పండించిన రైతులు, కొనుగోలు చేస్తున్న వినియోగదారులు అప్పులు పాలవుతున్న  విచిత్ర పరిస్థితి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తున్నామని చెప్పారు. రైతులు పంటలకు గిట్టుబాటు ధరల గురించి ప్రశ్నిస్తే వారిపై 307 సెక్షన్ తో అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 
 
 
రైతు సంక్షేమం కోసం పనిచేయాల్సిన ప్రభుత్వం వ్యాపారుల కొమ్ము కాస్తుందని, రైతుల దాన్యం అమ్ముకొనేందుకు అవసరమైన గోతాలు సరఫరా చేయకుండా ఆ గోతాలు వ్యాపారుల కిచ్చి వారు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసిన దాన్యాన్ని రైతుల పేరుతో కొనుగోలు చేస్తున్న దౌర్బాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆరుగాలం పండించిన పంటను అమ్ముకొనేందుకు ఆలోలక్ష్మణా అంటూ అలమటించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని నరేంద్ర కుమార్ చెప్పారు. 
 
 
రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు తమ కష్టాలు తీరుస్తాడని జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఒట్లేసి గెలిపించిన పాపానికి ఆయావర్గాల ఆశలను అడియాసలు చేశారని  నరేంద్రకుమార్  తెలిపారు. ఈనెలలో రెండుసార్లు గుంటూరు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు వినే ఓపిక లేకపోవటం ఆవేదన కలిగించే అంశమని అన్నారు. రాష్ట్రంలో నాలుగు లక్షల ఎకరాలలో సాగుచేసిన వరిపంటను కొనకుండా కౌలు రైతులు, సన్న, చిన్నకారు రైతులను ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని ఆరోపించారు. ఇటీవల కాలంలో జిల్లాలోని పత్తిపాడుకు వచ్చిన ముఖ్యమంత్రికి ఆప్రాంతంలో మిరప పంట సాగుచేసి నష్టపోయిన రైతులను పలకరించే ఓపిక, తీరిక లేకపోయిందని అన్నారు. 
 
 
రాష్ట్ర ప్రభుత్వం అనవసర ఆర్బాటాలకు, ఉత్తుత్తి ప్రచారానికి వేల కోట్ల రూపాయలు తగలేస్తుందని, ప్రచారంకోసం పథకాలు తప్ప, పథకాల కోసం ప్రచారం అన్న దొరణి ఎక్కడా కనిపించటం లేదని నరేంద్రకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్లు మాదాల వెంకటేశ్వరరావు, నన్నపనేని ప్రభాకరరావు,  పొన్నూరు, చేబ్రోలు  మండల టి‌డి‌పి అధ్యక్షులు బోర్రు రామారావు, నన్నపనేని కోటేశ్వరరావు, చేబ్రోలు, పొన్నూరు మండలాలలోని వివిధ గ్రామాల సర్పచ్ లు, మాజీ సర్పంచ్ లు, పలువురు కౌలు రైతులు, రైతులు, తెలుగు దేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.