1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 5 జూన్ 2024 (14:16 IST)

నా కుటుంబ సభ్యులే 22 మంది.. నాకొచ్చిన ఓట్లు నాలుగు : కేఏ పాల్

ka paul
ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని మండిపడ్డారు. తన కుటుంబంలో 22 మంది సభ్యులు ఉన్నారని, కానీ తనకు పోలైన ఓట్లు కేవలం నాలుగు మాత్రమేనని ఆయన గుర్తుచేశారు. విశాఖలో తొలి నుంచీ తానే ఆధిక్యంలో ఉన్నానని అధికారులు కూడా తనకు చెప్పారని గుర్తు చేశారు. అయితే, అనేక బూత్‌లలో తనకు ఒక్క ఓటు కూడా పడలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే రీపోలింగ్ జరపాలని కోర్టుకెళ్లానని ఆయన తెలిపారు. మురళీ నగర్‌లోని పోలింగ్ బూత్ 235లో తనకు అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి, సోదరుడు, సోదరి సహా మొత్తం 22 మంది కుటుంబ సభ్యులు తనకు ఓటు వేస్తే అక్కడ తనకు వచ్చిన ఓట్లు కేవలం నాలుగు మాత్రమేనని గుర్తు చేశారు. 
 
రాష్ట్రం ఎలా ఉందో ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని హితవు పలికారు. 1995లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసింది తానేనని చెప్పారు. అప్పట్లో నరేంద్ర మోడీ ఓ సాధారణ ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. ఈసారి సీసీటీవీ లింకులను అభ్యర్థులకు ఇవ్వలేదని, తనకు పడాల్సిన లక్షలాది ఓట్లు పడకుండా అడ్డుకున్నారని, చివరకు తన కుటుంబ సభ్యుల ఓట్లు కూడా పడలేదని వాపోయారు. తాను లీడ్‌లో ఉన్నట్టు అధికారులో చెప్పారని, కానీ 8 బూత్‌లలో తనకు ఒక్క ఓటు కూడా పడకపోవడం వెనుక ఏదో కుట్ర ఉందని కేఏ పాల్ ఆరోపించారు.