శుక్రవారం, 28 జూన్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 25 సెప్టెంబరు 2023 (12:57 IST)

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వైకాపా నేతల రాజీనామాలు.. ఫలించని సాయిరెడ్డి బుజ్జగింపులు

Babu
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వైకాపా నేతలు రాజీనాలు చేస్తున్నారు. ఇలాంటి వారిని బుజ్జగించేందుకు వైకాపా పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఫలితంగా అనేక మంది వైకాపా నేతలు పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నారు. తాజాగా ఒంగోలు జిల్లాలో గిద్దలూరు జడ్జీటీసీ, ముగ్గురు సర్పంచ్‌లు, పలువురు ఉప సర్పంచ్‌లు, అనేక మందినేతలు పసుపు కండువా కప్పుకున్నారు. వీరిని అపేందుకు వైకాపా ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి చేసిన బుజ్జగింపులు ఏమాత్రం ఫలించలేదు. 
 
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆదివారం జరిగిన ఈ చేరికలు వైసీపీ నేతలను కలవరానికి గురిచేశాయి. అధికార పార్టీ నేతల బెదిరింపులు, పోలీసు ఆంక్షలను అధిగమించి ఉమ్మడి ప్రకాశం జిల్లా నేతల సమక్షంలో గిద్దలూరు టీడీపీ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వారంతా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. వారిని అడ్డుకునేందుకు వైసీపీ నేత విజయసాయి రెడ్డి విశ్వప్రయత్నం చేసినా ఫలించలేదు. 
 
గిద్దలూరు జడ్పీటీసీ సభ్యుడు బుడతా మధుసూదన్ రావుతో పాటు మరో ముగ్గురు సర్పంచ్‌లు, ముగ్గురు మాజీ సర్పంచ్‌లు, పలువురు ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ఆయా గ్రామాల్లో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు మూకుమ్మడిగా తరలి వచ్చి టీడీపీలో చేరారు. 
 
చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆయనకు మద్దతుగా నిలవాలన్న ఉద్దేశంతో టీడీపీలో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. పార్టీలో చేరిన వారిని ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు హాజరై.. టీడీపీలో చేరిన వారిని అభినందించారు.