శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 జూన్ 2021 (16:44 IST)

హస్తినలో కలకలం సృష్టిస్తున్న 'ఆర్ఆర్ఆర్' - ఆ ఒక్కరికి మినహా అందరికీ లేఖలు..

వైకాపా రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు హస్తినలో కలకలం సృష్టిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను మీడియా సమావేశాల్లో తప్పుబట్టారు. అయితే రఘురామ అరెస్ట్ తర్వాత ఆయనకు సుప్రీంకోర్టు బెయిలిచ్చింది. 
 
ఆయనకు సుప్రీంకోర్టు కొన్ని షరతులు విధించింది. మీడియా సమావేశాలు నిర్వహించకూడదని చెప్పింది. అయితే రమురామ కోర్టు షరతులకు లోపడి ఏపీ ప్రభుత్వంపై తనదైనశైలిలో మరో పంథాలో పోరాటాన్ని సాగిస్తున్నారు. 
 
తన అరెస్టు‌, తదనంతర పరిణామాలను వివరిస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు రఘురామ లేఖ రాశారు. ఒక్క ఏపీ సీఎం జగన్‌కు మినహా అన్ని రాష్ట్రాల సీఎంలకు రఘురామ లేఖలు రాయడం గమనార్హం. ఏపీ సీఐడీ పోలీసులు తనపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించిన విషయాన్ని లేఖలో ఆయన ప్రధానంగా  ప్రస్తావించారు.
 
పలు అవినీతి కేసుల్లో చిక్కుకునివున్న జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్‌ వేసినందుకే.. కక్ష సాధింపులో భాగంగా తనను అరెస్ట్‌ చేయించారని రఘురామకృష్ణరాజు తెలిపారు. ఈ విషయంపై పార్లమెంట్‌లో తనకు మద్దతిచ్చేలా వారి ఎంపీలకు సూచించాలని సీఎంలను కోరారు. రాజద్రోహం సెక్షన్‌ను తొలగించేలా అసెంబ్లీల్లో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపాలని సీఎంలకు రాసిన లేఖలో రఘురామ కోరారు.
 
మరోవైపు, వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామరాజుకు మరికొందరు ఎంపీలు తమ సంఘీభావం తెలిపారు. సీఐడీ పోలీసుల కస్టడీలో తనను హింసించారంటూ ఆయన రాసిన లేఖపై ఆర్ఎస్పీ ఎంపీ ఎన్‌కే ప్రేమచంద్రన్‌, బిజూజనతాదళ్‌ ఎంపీలు చంద్రశేఖర్‌ సాహూ, పినాకీ మిశ్రా ఆదివారం స్పందించారు. 
 
'రఘురామరాజును హింసించడం క్రూరం, అమానుషం, ఆటవికం. ఒక ఎంపీపై దాడి చేయడం పార్లమెంటును అవమానించడమే. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతాం' అని ప్రేమచంద్రన్‌ అన్నారు. రఘురాజును నిర్దాక్షిణ్యంగా  హింసించిన వైనం దిగ్ర్భాంతి కలిగించిందని, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వారే ఇలాంటి దాడులకు పాల్పడి ఉంటారని ఆయన అన్నారు.