వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం - ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాతావరణ శాఖ కీలక హెచ్చరిక చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడివున్న అల్పపీడనం, బుధవారానికి మరింతగా బలపడి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా, ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అందువల్ల ప్రజలతో పాటు జాలర్లు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైవున్న ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో మరింతగా బలపడనుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తదుపరి 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని కారణంగానే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా పెరగవచ్చని తెలిపారు.
ఈ అల్పపీడనం ప్రభావంతో మంగళవారం ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి ఏలూరు జిల్లా వరకు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.
ఈ నేపథ్యంలో అధికారులు మత్స్యకారులకు ప్రత్యేక హెచ్చరికలు జారీచేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండే ప్రమాదం ఉన్నందున ఎవరూ వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. అదేవిధంగా నదులు, వాగుల సమీపంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉంటూ, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళాలని సూచన చేసింది.