1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 14 నవంబరు 2022 (23:15 IST)

ఉత్సాహంగా ప్రారంభమైన ప్రాంతీయ పాలీ టెక్ ఫెస్ట్‌లు

sudharani
రాష్ట్రస్థాయి పాలీ టెక్ ఫెస్ట్‌కు విద్యార్థులను సన్నద్ధం చేసే క్రమంలో వివిధ జిల్లాలలో రెండు రోజుల పాటు నిర్వహించే  ప్రాంతీయ పాలిటెక్ ఫెస్ట్‌లు సోమవారం ప్రారంభం అయ్యాయని సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి తెలిపారు. ఉమ్మడి కర్నూలు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల పరిధిలో ఇవి ప్రారంభం కాగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో గురువారం వరకు ఇవి జరగనున్నాయన్నారు. కర్నూలు కెవి సుబ్బారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 54, గన్నవరం డిజెఆర్ పాలిటెక్నిక్‌లో 98, సూరంపాలెం ఆదిత్యా పాలిటెక్నిక్‌లో వందకు పైగా ఔత్సాహిక అంశాలను విద్యార్ధులు ప్రదర్శించారన్నారు.
 
కాకినాడ జిల్లా సూరంపాలెంలో నిర్వహించిన ప్రాంతీయ టెక్ ఫెస్ట్‌లో స్వయంగా పాల్గొన్న నాగరాణి స్దానికంగా మీడియాతో మాట్లాడారు. మంగళవారం పశ్చిమ గోదావరి, బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కడప, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు ఉమ్మడి జిల్లాల పరిధిలో ప్రాంతీయ టెక్ ఫెస్ట్ లు ప్రారంభం అవుతాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం చూపేలా విజయవాడ ఎస్ఎస్ కన్వేన్షన్ వేదికగా రాష్ట్ర స్దాయి పాలీ టెక్ ఫెస్ట్ 2022ను నవంబర్ 24 నుండి 26 వరకు మూడు రోజులు నిర్వహిస్తున్నామన్నారు.
 
విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వినూత్నఆలోచనలను ప్రోత్సహించే క్రమంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తుండగా 800 పైగా సృజనాత్మక ప్రాజెక్ట్‌లు ప్రదర్శించబడతాయని అంచనా వేసామని నాగరాణి పేర్కొన్నారు. రాష్ట్ర స్దాయి టెక్ ఫెస్ట్ లో 84 ప్రభుత్వ, 173 ప్రైవేట్ పాలిటెక్నిక్‌లు పాల్గొననుండగా, విద్యార్ధులను ప్రోత్సహించే క్రమంలో రాష్ట్ర స్థాయిలో తొలి మూడు స్ధానాలు దక్కించుకున్నవారికి లక్ష, యాభైవేలు, ఇరవై ఐదువేల రూపాయల నగదు బహుమతి, జిల్లా స్ధాయిలో ప్రధమ, ద్వితీయ స్ధానాలు పొందిన వారికి ఇరవై ఐదు వేలు, పదిహేను వేల రూపాయల నగదు బహుమతులు అందిస్తున్నామని సాంకేతిక విద్యాశాఖ సంచాలకురాలు చదలవాడ నాగరాణి వివరించారు. విద్యార్ధులు ప్రదర్శించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించిన నాగరాణి ప్రతి ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.