బుధవారం, 18 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 సెప్టెంబరు 2024 (10:52 IST)

బుడుమేరు కట్ట మళ్లీ తెగిందంటూ ప్రచారం.. నమ్మొద్దంటున్న పోలీసులు...

budameru gandlu
ఇటీవలే విజయవాడ నగరానికి శివారు ప్రాంతంలో ఉన్న బుడమేరుకు గండ్లుపడ్డాయి. ఈ కారణంగా వరద ప్రవాహంతో విజయవాడ నగరాన్ని ముంచెత్తింది. దీంతో అనేక జనావాస ప్రాంతాలు నీటి మునిగిపోయారు. ప్రభుత్వ యంత్రాంగం అంతా పది రోజులు తీవ్రంగా శ్రమించాక, విజయవాడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. 
 
అయితే, బుడమేరకు మళ్లీ గండ్లు పడ్డాయని, మళ్లీ వరద వస్తోందని పుకార్లు బయల్దేరాయి. దీనిపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పందించారు. బుడమేరకు గండ్లు పడ్డాయన్న వదంతులు నమ్మవద్దని స్పష్టం చేశారు. బుడమేరుకు ఎలాంటి వరద నీరు రాలేదని, అలాగే, గండి కూడా పడలేదని పోలీసులు స్పష్టం చేశారు. బుడమేరకు మళ్లీ వరద అంటూ కొందరు అకతాయిలు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారని కలెక్టర్ సృజన వివరించారు. పుకార్లు వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
 
మరోవైపు, ఈ వదంతులపై ఏపీ మున్సిపల్ శాఖామంత్రి నారాయణ కూడా స్పందించారు. బుడమేరుకు మళ్లీ వరద వస్తోందని, విజయవాడలోని అజిత్ నగర్, తదితర ప్రాంతాలు మళ్లీ నీట మునుగుతాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని ఆయన కోరారు. బుడమేరకు మళ్లీ వరద వస్తుందంటూ సాగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన చెప్పారు. కొత్త రాజేశ్వరిపేట, జక్కంపూడి కాలనీల్లో ఎలాంటి వరద నీరు రాలేదని వెల్లడించారు. బుడమేరు కట్ట మళ్లీ తెగిందనేది పూర్తిగా అవాస్తమని, ప్రజలు ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని మంత్రి నారాయణ తెలిపారు.