శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 25 జూన్ 2020 (21:57 IST)

జగన్ ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక: మంత్రి బొత్స

జూలై 8 వ తేదీన పంపిణీ చేయదలచిన ఇళ్లు, ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని విధాలుగా సన్నద్దం కావాలని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు.

ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు.

ఇళ్ల పట్టణాలు, ఇళ్లు కేటాయింపు ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను కూడా తెలుసుకుని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరించాలని మున్సిపల్ కమిషనర్లు, పట్టణ టిడ్కో అధికారులకు ఆయన స్పష్టం చేశారు. 

పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై  పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, స్పెషల్ సెక్రటరీ రామ మనోహర్, టిడ్కో ఎండి శ్రీధర్ తదితర ఉన్నతాధికారులతో కలిసి గురువారం నాడు ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఆయన కమిషనర్లతో మాట్లాడుతూ, ఆయా ప్రాంతాల్లో పట్టాల పంపిణీ కోసం అవసరమైన  స్థల లభ్యత, లబ్ధిదారుల సంఖ్య తదితర అంశాలపై ఆరా తీశారు. ఇప్పటికే ఎంపిక పూర్తి అయిన లబ్ధిదారులకు, బ్యాంకు రుణాల మంజూరు తదితర అంశాల పై తీసుకుంటున్న చర్యలను కూడా తెలుసుకున్నారు.

అనేక మున్సిపాలిటీల్లో ఇప్పటికీ ప్రారంభదశలోనే ఉన్న ఇళ్ల నిర్మాణపు పనులకు సంబంధించిన వివరాలను కమిషనర్లను అడిగి తెలుసుకున్నారు. వీటికి సంబంధించి త్వరలోనే విధానపరమైన నిర్ణయాలు తీసుకోనున్నామని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పట్టణప్రాంతాల్లోని అర్హులైన పేదలందరికీ సొంత ఇంటి వసతి సమకూర్చడంలో అధికారులందరూ చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఉద్భోదించారు.