గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 19 జులై 2024 (09:20 IST)

కుటుంబ సభ్యులను బెదిరించేందుకు ఉరేసుకున్న భర్త ... పొరపాటున ఉరి బిగుసుకోవడంతో...

suicide
విశాఖపట్టణంలో ఓ విషాదకర ఘటన ఒకటి వెలుగు చూసింది. తన మాట ఏమాత్రం పట్టించుకోకుండా, పదేపదే విసిగిస్తున్న భార్యా, పిల్లలను బెదిరించేందుకు ఓ భర్త మెడకు ఉరి బిగించుకున్నాడు. అది కాస్త పొరపాటున గట్టిగా బిగుసుకుని పోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ గోపాలపట్నం పోలీసుల కథనం ప్రకారం, బీహార్‌కు చెందిన చందన్ కుమార్ (33) రైల్వేలో సీనియర్ అసిస్టెంట్ లోకోపైలట్. ఐదేళ్ల నుంచి 89వ వార్డు కొత్తపాలెంలో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. బుధవారం రాత్రి కుమార్తె (7), కుమారుడు (5) ఆయన చొక్కా జేబులోని కరెన్సీ నోట్లను తీసి చించేశారు. పిల్లలపై చిరాకు పడుతున్న చందన్ కుమార్‌కు భార్య అడ్డుపడింది.
 
ఈ సందర్భంగా భార్యాభర్తల మధ్య స్వల్ప గొడవైంది. తనకు ప్రశాంతత లేకుండా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చందన్ కుమార్ బెదిరించారు. అయినా ఎవరూ వినిపించుకోలేదు. దీంతో, ఆయన ఇంట్లోని ఫ్యానుకు చీర కట్టి, దాన్ని మెడకు చుట్టుకుని కుటుంబసభ్యుల్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. అంతలో పొరపాటున చీర మెడకు బిగుసుకోవడంతో ఊపిరాడక గిలగిల్లాడారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడేందుకు భార్య ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కేజీహెచ్‌కప తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.