శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (21:03 IST)

సెప్టెంబరు ఒకటో తేదీ : "మిలియన్ మార్చ్‌"కు అనుమతి లేదు

chalo vijayawada
సీపీఎస్ (సెంట్రల్ పెన్షన్ స్కీమ్) రద్దు కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సెప్టెంబరు ఒకటో తేదీన తాడేపల్లిలోని సీఎం జగన్మోహన్ రెడ్డిని నివాసం ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందుకోసం ఛలో తాడేపల్లి, ఛలో విజయవాడలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా, లక్ష మందికి సీఎం ఇంటి వద్ద మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. 
 
ఈ నేపథ్యంలో గుంటూరు ఎస్పీ హఫీజ్ కీలక ఆదేశాలు జారీచేశారు. "ఛలో విజయవాడ", "ఛలో తాడేపల్లి" కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. తమ ఆదేశాలను ఉల్లంఘించి ఆందోళనలో పాల్గొనేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 
 
ఒక్క గుంటూరు జిల్లాలోనే ఇప్పటికే 2 వేల మందికి నోటీసులు ఇచ్చామని ఎస్పీ తెలిపారు. విజయవాడ, తాడేపల్లిలలో 144 సెక్షన్, పోలీస్ యాక్ట్ 30ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. అందువల్ల మిలియన్ మార్చ్ కార్యక్రమంలో ఏ ఒక్కరూ పాల్గొనవద్దని ఆయన కోరారు.