1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 13 సెప్టెంబరు 2021 (23:01 IST)

మనుపాత్ర పేరిట కేసుల వేగవంతం కోసం ప్రత్యేక యాప్: రజత్ భార్గవ

కోర్టు కేసుల విషయంలో ఎటువంటి అలసత్వం కూడదని, సమయానుసారంగా కేసుల పురోగతిపై స్పష్టత కలిగి ఉండాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ వివిధ విభాగాల అధిపతులను ఆదేశించారు.

న్యాయస్ధానాలకు అవసరమైన సమాచారాన్ని సకాలంలో అందించాలని, కేసులకు సంబంధించిన వ్యవహారాలను ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ ఉండాలని స్పష్టం చేసారు. సోమవారం సచివాలయంలో పర్యాటక, భాషా సాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ, అబ్కారీ, వాణిజ్య పన్నులు, స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ శాఖల అధికారులతో కోర్టు కేసుల విషయంపై ప్రత్యేకంగా ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు.
 
ఈ సందర్భంగా రజత్ భార్గవ మాట్లాడుతూ ఆయా విభాగాలు కేసుల సంఖ్యను అనుసరించి ప్రత్యేకంగా లీగల్ సెల్‌ను ఏర్పాటు చేసుకోవాలని, క్రింది స్దాయిలో జరిగే తప్పుల వల్ల ప్రభుత్వానకి చెడ్డపేరు రాకుండా చూసుకోవాలని స్పష్టం చేసారు. వివిధ విభాగాలకు సంబంధించి ప్రభుత్వ న్యాయవాదులతో ప్రతి కార్యాలయం నుండి ఒకరు లైజనింగ్ నిర్వహించాలని, అటు ప్రభుత్వ శాఖలు ఇటు ప్రభుత్వ న్యాయవాదుల మధ్య సమన్వయం ఉండాలని సూచించారు.
 
ఈ సందర్భంగా రజత్ భార్గత అయా విభాగాలకు సంబంధించి వివిధ స్దాయిలలో ఉన్న కేసుల సంఖ్య ఎంత అన్న దానిపై విచారించారు. రిజస్ట్రేషన్ల విభాగానికి సంబంధించి దాదాపు 2000 పైచిలుకు కేసులు ఉండగా, పర్యాటక రంగం నుండి 50, క్రీడా విభాగానికి సంబంధించి 52, వాణిజ్య పన్నుల శాఖకు సంబంధించి 114 కేసులు వివిధ దశలలో ఉన్నట్టు ప్రభుత్వ ప్రత్యేక ప్రదాన కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు.
 
ఈ నేపధ్యంలో కేసులకు సంబంధించి విభజన చేసుకుని త్వరిత గతిన పరిష్కారం అయ్యే కేసుల విషయంలో శ్రద్ధ వహించాలన్నారు. కోర్టు కేసులు త్వరితగతిన ముగించుకునేందుకు సహాయ పడేలా రూపొందించిన మనుపాత్ర యాప్‌ను గురించి రజత్ భార్గవ సమావేశంలో వివరించారు. దీనిపై అయా శాఖల నుండి కొందరు అధికారులకు ప్రత్యేక శిక్షణను సైతం అందించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రాధికార సంస్ధ ముఖ్య కార్యనిర్వహణ అధికారి సత్యన్నారాయణ, బివరేజస్ కార్పోరేషన్ ఎండి వాసుదేవరెడ్డి, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ కమీషనర్ శేషగిరిబాబు తదితరులు పాల్గొన్నారు.