శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 12 అక్టోబరు 2019 (08:11 IST)

ఏపీ హైకోర్టులో సంస్కరణలకు శ్రీకారం

కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా హైకోర్టులో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

ఆధునిక సాంకేతికత వినియోగంతో కేసుల విచారణను సాధ్యమైనంత త్వరగా ముగించేలా సన్నాహాలు మొదలుపెట్టారు. ఈ-ఫైలింగ్‌ను ప్రోత్సహించేందుకు తగిన ఏర్పాట్లు చేయడానికి పూనుకున్నారు. దీనిపై ఇప్పటికే హైకోర్టు రిజిస్ట్రార్‌లకు పలు సూచనలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కక్షిదారులు పిటిషన్‌ దాఖలు చేసినప్పటి నుంచి తీర్పు కాపీ అందేవరకు ఎక్కడా జాప్యం జరుగకుండా ప్రక్రియ సాఫీగా నడిచేలా చర్యలు తీసుకోవడంపై న్యాయ విభాగం ఉన్నతాధికారులతో సీజే చర్చించినట్లు సమాచారం.
 
అలాగే కేసులు కూడా వరుస క్రమాన్ని బట్టి, ప్రాధాన్యతను బట్టి ఆటోమేటిగ్గా లిస్టయ్యేలా సాఫ్ట్‌వేర్‌లో చేయాల్సిన మార్పులు, చేర్పులపై దృష్టి సారించారు. 
 
సోమవారం ఉద్యోగులతో భేటీ: హైకోర్టులో పలు ఖాళీలు భర్తీ కావాల్సి ఉంది. తగినంతమంది ఉద్యోగులు లేకపోవడంతో ఇప్పటికే వున్న సిబ్బందిపై తీవ్ర పని ఒత్తిడి వున్నట్లు ఉన్నతాధికారులు సీజే దృష్టికి తీసుకెళ్లారు. దానిపై ప్రత్యేక దృష్టి సారించిన సీజే... సోమవారం హైకోర్టు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నట్లు తెలిసింది.

కోర్టులో ఖాళీగా వున్న పోస్టుల్ని సాధ్యమైనంత త్వరగా భర్తీ చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇప్పటికే సీజే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.