గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 18 సెప్టెంబరు 2019 (21:06 IST)

జీవోలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు

ప్రభుత్వం జారీ చేసే జీవోలను ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదన్న.. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు నోటీసులు జారీ చేసింది.

జీవోలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేయడం లేదన్న అంశంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. జీవోలు, సర్క్యూలర్లను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరుతూ.. భాజపా నాయకుడు పేరాల శేఖర్రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది.

రాష్ట్ర ప్రభుత్వం లక్ష 7 వేల ఉత్తర్వులు జారీ చేయగా... అందులో 42 వేల 500 జీవోలు ప్రజలకు అందుబాటులో లేవని పిటిషన్లో పేర్కొన్నారు. ప్రజలకు సమాచారం లేకుండా చేయడం.. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.

వెబ్సైట్లో వెంటనే అప్లోడ్ చేసే బాధ్యతను సీనియర్ అధికారికి అప్పగించాలని పిటిషనర్ కోరారు. ఈ అంశంపై రెండు వారాల్లోగా స్పందించాలని ప్రభుత్వ సీఎస్, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీని కోర్టు ఆదేశించింది.