1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 జులై 2023 (14:43 IST)

డిసెంబరు లోపు అమరావతి పిటిషన్లపై విచారణ కదురదు : సుప్రీంకోర్టు

amaravati capital
ఏపీ రాజధాని అమరావతి రాజధాని వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై విచారణ డిసెంబరులోపు కుదరదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వీటిపై డిసెంబరులో విచారిస్తామని పేర్కొంది. ఈ మేరకు విచారణను వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ పిటిషన్లపై విచారణను అత్యవసరంగా విచారించాలంటూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. 
 
ఇతర రాజ్యాంగ ధర్మాసనాల కేసులు విచారించాల్సివుందని, నవంబర్ వరకు ఈ కేసుల విచారణ జరుగుతుందని తెలిపింది. ఈ మేరకు మంగళవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును పరిశీలించి విచారణను డిసెంబరుకు వాయిదా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యర్థనను మన్నించలేమని పేర్కొంది. 
 
అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలన్న ఏపీ హైకోర్టు ఆదేశాలపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. ఆరు నెలల్లో అమరావతి రాజాధానిని నిర్మించాలన్న హైకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అయితే, కేంద్ర ప్రభుత్వం, ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. గతంలో ఈ కేసును విచారించిన న్యాయమూర్తి జస్టిస్ జోసెఫ్ పదవీ విరమణ చేశారు. దీంతో ఈ కేసు జస్టిస్ ఖన్నా, జస్టిస్ బేలా ఎం త్రివేదిల బెంచ్‌కు బదిలీ అయింది.