శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 23 మే 2020 (22:53 IST)

కరోనా నియంత్ర‌ణ చ‌ర్య‌ల‌పై ప్రజల్లో అవగాహన‌కు ఇంటింటా సర్వే: నీలం సాహ్ని

ఈ నెల 25వ తేదీ నుండి కరోనా వైరస్ నియంత్ర‌ణ‌పై ఇంటింటా సర్వే ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్గించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని వెల్లడించారు.

కరోనా వైరస్ నియంత్రణ చర్యలపై శనివారం విజయవాడ సిఎస్ క్యాంపు కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ కరోనా వైరస్ ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కలిగించేందుకు రెండు కరపత్రాలను ప్రచురించడం జరిగిందని వాటిని జిల్లాల్లో అవసరమైన సంఖ్యలో ప్రచురించి అవి ప్రతి ఇంటికీ పంపిణీ చేసి వైరస్ నియంత్రణ కు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించాలని కలెక్టర్లను ఆదేశించారు.

ఈనెల 25వతేది సోమవారం నుండి చేపట్టే 5వ విడత  ఇంటింటా సర్వేలో ప్రధానంగా కరోనా ప్రజల్లో విస్తృత అవగాహనకు చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని స్పష్టం చేశారు. ఎఎన్ఎం,ఆశావర్కర్,గ్రామ,వార్డు వాలంటీర్లు తో కూడిన బృందం ఇంటింటీకీ వెళ్ళి ప్రజల్లో అవగాహన కలిగించాలని చెప్పారు.

ఇందుకుగాను సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలని సిఎస్ చెప్పారు. కరోనా లక్షణాలు-పరీక్ష-చికిత్స పై ఒక కరపత్రాన్ని ప్రచురించగా దానిలో కరోనా లక్షణాలైన పొడిదగ్గు,గొంతునొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. ఆ లక్షణాలుంటే అనగా స్వల్ప లక్షణాలు ఉంటే 14రోజులు స్వీయ నిర్బంధంలో ఉంటూ సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి లేదా ఆసుపత్రికి సమాచారం ఇవ్వాలి.

తీవ్రమైన లక్షణాలుంటే సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రం లేదా జిల్లా ఆసుపత్రిని తప్పనిసరిగా సందర్శించాలి.అంతేగాక స్వల్ప లక్షణాలున్నా ఆప్పటికే చక్కెర వ్యాధి, రక్త పోటు,ఉబ్బసం, గుండె,మూత్ర పిండ వ్యాధులు ఉన్నవారు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.వైద్య సహాయం కావాల్సిన వారు104 లేదా,14410-వైయస్సార్ టెలి మెడిషన్ ద్వారా కూడా పొందవచ్చును.

అదే విధంగా ఎవరు పరీక్షలు చేయించుకోవాలి అంటే కరోనా లక్షణాలున్న వారు,పాజిటివ్ అని తేలిన వారితో కలిసి తిరిగిన వారు,కరోనా బాధితులకు చికిత్స చేస్తున్నవారు,విదేశాలు,కరోనా ఎక్కువగా విస్తరించిన ప్రాంతాల నుండి వచ్చిన వారు. కరోనా పరీక్షల తర్వాత.. పాజిటివ్ గా నిర్థారిస్తే వైద్యుల సలహా మేరకు స్వీయ గృహ నిర్బంధంలో లేదా ఆసుపత్రికి తరలించాలి.స్వీయ గృహ నిర్బంధంలో ఉంటే వాటికి సంబంధించిన నిబంధనలను పూర్తిగా పాటించాలి.

లేకపోతే కుటుంబ సభ్యులకు, చుట్టుపక్కల వారికి విస్తరిస్తుంది.అదే విధంగా అపోహలను పారద్రోలుదాం. కరోనా ఎవరికైనా రావచ్చు కానీ అది నివారణ అవుతుంది. ఎక్కువ మందిలో ఈవ్యాధి లక్షణాలు కూడా కనిపించవు. స్వీయ నిర్భంధంలోనే ఎక్కువ మందికి ఈవ్యాధి నివారణ చేయవచ్చు.

కరోనా లక్షణాలు ఉన్నవారిలో 15శాతం మందికి మాత్రమే చికిత్స అవుసరం ఉంటుంది.పాజిటివ్ వచ్చిన వారిని వారి కుటుంబ సభ్యులను వివక్షతో కాకుండా సానుభూతితో చూడండి ఈసమయంలో అపోహలకు తావులేకుండా ఒకరి నొకరు సహకరించుకుంటూ కరోనాను పారద్రోలుదాం..కరోనా భయం వద్దు.. జాగ్రత్తలు పాటిద్దాం.. అనే పేరు సమాచారంతో ఈ కరపత్రాన్ని ముద్రించారు.

కరోనా వ్యాప్తి నివారణ మార్గాలు పేరిట మరో కరపత్రాన్ని ముద్రించారు. దానిలో ముఖ్యంగా కరోనా లక్షణాలు,అది ఎలా సంక్రమిస్తుంది, నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలు ముద్రించి ఈరెండు కరపత్రాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 25 నుండి చేపట్టే 5వ విడత ఇంటింటా సర్వే ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకోనున్నారు.

ఈ నెల 25నుండి 30వరకూ ఈ ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్ర,జిల్లా కేంద్రాల్లో పలుకార్య క్రమాలు నిర్వహించాలని సిఎస్ నీలం సాహ్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.రాష్ట్ర స్థాయిలో 25న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో 50పాల్గొనే కార్యక్రమం లైవ్ టెలీ కాస్ట్ చేయబడుతుందని తెలిపారు.

అలాగే జిల్లా కేంద్రాలలో 25న గ్రామ,వార్డు సచివాలయ వ్యవస్థ, 26న వ్యవసాయ అనుబంధ రంగాలు,27న విద్య,28నమౌలిక సదుపాయాలు, నైపుణ్యం, గృహనిర్మాణం, 29న ఆరోగ్యం, 30న రైతు భరోసా కేంద్రాలు వాటి ప్రారంభోత్సవం కార్యక్రమాలు ఉంటాయని సిఎస్ పేర్కొన్నారు.

ప్రతి రోజు జిల్లాల్లో కూడా 50మందికి మించి హాజరు కాకుండా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందని ఇందుకు సంబంధించి ఇప్పటికే జిఓసంఖ్య.153ద్వారా ఉత్తర్వులు జారీ చేయడమైనది సిఎస్ నీలం సాహ్ని చెప్పారు.

వీడియో సమావేశంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ కె.భాస్కర్, మున్సిపల్ పరిపాలన శాఖ కమీషనర్ మరియు ప్రణాళిక శాఖ కార్యదర్శి జిఎస్ఆర్కె విజయకుమార్, సిఆర్డిఏ అదనపు కమీషనర్ విజయకృష్ణన్ పాల్గొన్నారు.