1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 4 జూన్ 2024 (11:10 IST)

ఏపీ అసెంబ్లీ ఎన్నికలు : అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి సునామీ!!

tdp alliance
ఆంధ్రప్రేదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం ఉదయం నుంచి వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సునామీ సృష్టిస్తుంది. ఇప్పటికే మొత్తం 175 సీట్లలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 88 మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి, ఏకంగా 153 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఫలితంగా టీడీపీ కూటమి ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటివరకు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు 153కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 
 
వైకాపా కేవలం 23 చోట్ల మాత్రమే లీడ్‌లో ఉంది. తొలి రౌండ్‌ నుంచే కూటమి అభ్యర్థులు పూర్తిస్థాయిలో ఆధిపత్యాన్ని కనబర్చారు. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో సత్తా చాటారు. వైకాపాకు పట్టు ఉన్నట్లుగా భావించే రాయలసీమ జిల్లాల్లోనూ కూటమికే అధిక్యంలో కొనసాగడం గమనార్హం. 
 
ఈ ఎన్నికల ఫలితాలు అనేక మంది టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంగళగిరిలో నారా లోకేశ్‌, పూతలపట్టులో మురళీమోహన్‌ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌ ముగిసేసరికి చంద్రబాబుకు 1,594, బుచ్చయ్య చౌదరి 910 ఓట్ల ఆధిక్యం లభించింది.
 
జగ్గంపేట అసెంబ్లీ స్థానంలో జ్యోతుల నెహ్రూ, రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి వాసు, తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్‌, చిత్తూరులో గురజాల జగన్‌మోహన్‌కు లీడ్‌ వచ్చింది. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు, ఒంగోలులో దామచర్ల జనార్దన్‌, గుడివాడలో వెనిగండ్ల రాము, ఉండిలో రఘురామకృష్ణరాజు, గురజాలలో యరపతినేని శ్రీనివాస్‌, పాణ్యంలో గౌరు చరితారెడ్డి, పెనుకొండలో సవిత, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, విశాఖపట్నం తూర్పులో వెలగపూడి రామకృష్ణబాబుకు లీడ్‌ వచ్చింది. రెండో రౌండ్‌ ముగిసేసరికి బుచ్చయ్య చౌదరి ఆధిక్యంలో ఉన్నారు.