మంగళవారం, 19 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2019 (14:40 IST)

చంద్రబాబు ఇంటిని ఖాళీ చేయించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : అచ్చెన్నాయుడు

తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివశిస్తున్న ఇంటి నుంచి ఖాళీ చేయించాలన్న ఏకైక లక్ష్యంతోనే వైకాపా ప్రభుత్వం నడుచుకుంటోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. 
 
పలువురు టీడీపీ నేతలు సోమవారం ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్‌ను కలిసి, డ్రోన్ల వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఆ  తర్వాత అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ, వరద సహాయకచర్యల్లో ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని అన్నారు. కృష్ణానదికి వరదలు వస్తాయని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆరోపించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు పడలేదని, ఎగువ ప్రాంతాల్లో వర్షాల వల్ల మనకు వరదలు వచ్చాయని మండిపడ్డారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ధ్వజమెత్తారు. కనీస అవగాహన లేకుండా జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతున్నారని, ప్రకాశం బ్యారేజీలో 40 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చని మాట్లాడుతుంటే ఆ మంత్రిని ఏమనాలని ప్రశ్నించారు? ఎత్తిపోతల పథకాలను సరిగా వినియోగించుకుంటే నీటిని నిల్వ చేసుకోవచ్చని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. 
 
వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో ఇంటిని అద్దెకు తీసుకున్న చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూశారని ఆరోపించారు. గత ఐదేళ్లలో ఎక్కడ వరదలు తుపాన్లు వచ్చినా చంద్రబాబు పని చేసిన విధానాన్ని అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు మాత్రం వరదలు వచ్చినప్పుడు సీఎం జగన్‌ విహారయాత్రలకు వెళ్లారని ఎద్దేవా చేశారు.