గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 22 జులై 2019 (14:51 IST)

బీజేపీలో చేరుతానన్న రాయపాటి.. ఆషాఢ మాసంలో వద్దన్న కన్నా!

తెలుగుదేశం పార్టీకి గుంటూరు జిల్లాలో మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. టీడీపీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ వద్ద ప్రస్తావించారు. అయితే, కన్నా మాత్రం ఇది ఆషాఢమాసమని అందువల్ల ఇపుడు చేరవద్దని సలహా ఇచ్చారు. 
 
సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా మారిపోయిన విషయం తెల్సిందే. టీడీపీ చిత్తుగా ఓడిపోవడంతో ఆ పార్టీకి చెందిన అనేక మంది సీనియర్ నేతలు బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులు కాషాయం కండువా కప్పుకున్నారు. అలాగే, మరికొందరు ద్వితీయశ్రేణి నేతలు కూడా బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో గుంటూరు మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివ రావు కూడా పార్టీ మారాలన్న నిర్ణయానికి వచ్చారు. తాను బీజేపీలో చేరుతున్నట్లు రాయపాటి ఓ ప్రకటన చేశారు. రెండు రోజుల క్రితం బీజేపీ నేత రాంమాధవ్‌తో భేటీ తర్వాత రాయపాటి లక్ష్మీనారాయణ పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నారు. రాంమాధవ్ ఆహ్వానం మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకుని, బీజేపీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. 
 
ఇదే విషయాన్ని సోమవారం తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం రాయపాటి వెల్లడించారు కూడా. దీనిపై కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. బీజేపీలో చేరేందుకు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆసక్తిగా ఉన్నారన్నారు. ఆషాఢమాసం వల్ల చేరికలు ఆగాయన్నారు. శ్రావణ మాసంలో మాత్రం భారీ సంఖ్యలు చేరికలు ఉంటాయని వెల్లడించారు.