1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 23 డిశెంబరు 2019 (15:35 IST)

బిత్తర సత్తిలా తమ్మినేని.. అలా అంటే గుడ్డలూడదీసి కొడతారు : తెదేపా నేత కూన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని ఎడారితో పోల్చుతూ ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత కూన రవికుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ్మినేని సీతారాం ఒక సభాపతిగా కాకుండా అత్తిరి బిత్తిరి సత్తిలా నడుచుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా, సొంతూరికి కనీసం రహదారి, మౌలిక సదుపాయాలు కల్పించలేని తమ్మినేని అమరావతి రాజధానిని ఎడారితో పోల్చడం సిగ్గు చేటంటూ ఫైర్ అయ్యారు. 
 
తమ్మినేని సీతారాం ఎడారి వ్యాఖ్యలపై కూన స్పందిస్తూ, తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడును, అమరావతి రాజధాని విషయంలోను తమ్మినేని అనుచిత వ్యాఖ్యలు చేస్తే గుడ్డలు ఊడదీసి కొడతానని హెచ్చరించారు. తన భార్య, కొడుకు కలిసి జిల్లాలో అక్రమ ఇసుక దందా చేస్తుంటే అడగలేని చేతగాని భర్త, తండ్రిలా వ్యవహరిస్తున్న తమ్మినేని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. 
 
తన స్థాయి మరచి ఐదు కోట్ల ఆంధ్రుల మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్న స్పీకర్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇటువంటి స్పీకర్ రాష్ట్రానికి ఉండటం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని కూన వ్యాఖ్యానించారు. తమ్మినేని వంటి వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉండటం శాసన వ్యవస్థకే మాయని మచ్చని కామెంట్ చేశారు. శాసనసభ సిగ్గు పడేలా వ్యవహరించిన స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
ముఖ్యంగా, సాక్షాత్ ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి, 33 వేల ఎకరాల భూమిని రైతులు స్వచ్చందంగా ముందుకు వచ్చి ఇచ్చిన ఏపీ రాజధాని అమరావతిని ఎడారితో పోలచటం తమ్మినేని దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు.