1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 6 మార్చి 2019 (09:57 IST)

అక్కడొకరు.. ఇక్కడొకరు.. వైకాపా - టీడీపీ నేతల స్థానమార్పిడి

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇరు పార్టీల్లో జంప్ జిలానీలు ఎక్కువైపోతున్నారు. ఇప్పటికే పలువురు అధికార టీడీపీ నేతలు విపక్ష వైకాపాలో చేరిపోయారు. అలాగే వైకాపాకు చెందిన నేతలు టీడీపీలో చేరుతున్నారు. 
 
ఈ నేపథ్యంలో తాజాగా వైకాపాకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఆమె భర్త వెంకటరెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం పునర్విభజన తర్వాత ఓ మారు కాటసాని రాంభూపాల్ రెడ్డిని, మరోసారి చరితను ప్రజలు ఆదరించారని గుర్తు చేశారు. 
 
ఎవరు ఎలా పనిచేస్తారో ప్రజలకు తెలిసిందని, రానున్న ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే ఎవరన్న విషయాన్ని వారే నిర్ణయించుకుంటారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తమవెంటే ఉన్నారని, 9వ తేదీన కార్యకర్తలు భారీగా తరలిరావాలని అన్నారు.
 
అలాగే, టీడీపీకి చెందిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగులు వేణుగోపాల్ రెడ్డి కూడా పార్టీ మారనున్నారు. ఆయన బుధవారం వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డిని కలిసి వైకాపా జెండా కప్పుకోనున్నారు. 
 
నిజానికి మోదుగులకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలిచిమరీ టిక్కెట్ ఇచ్చారు. ఫలితంగా 2009 ఎన్నికల్లో మోదుగుల్లో పోటీ చేసి 2014 ఎన్నికల వరకు ఎంపీగా కొనసాగారు. తిరిగి ఆ ఎన్నికల్లో కూడా మోదుగులను అదే నియోజకవర్గం నుంచి ఎంపీ ఎన్నికల బరిలోకి దించాలని టీడీపీ అధినేత ఆలోచన చేస్తున్న సమయంలో అప్పట్లో నోరుజారి మోదుగుల చేసిన వ్యాఖ్యలు ఆయనకు చేటుతెచ్చాయి. 
 
టీడీపీ అధిష్టానం నరసరావుపేట లోక్‌సభా స్థానం నుంచి రాయపాటి సాంబశివరావుకు సీటిచ్చి బరిలోకి దించారు. దీంతో అసంతృప్తికి గురయిన మోదుగులను చంద్రబాబు బుజ్జగించి గుంటూరు పశ్చిమ నుంచి పోటీచేసేందుకు అంగీకరింపజేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా మోదుగుల వ్యవహరించిన తీరు పార్టీకి, జిల్లా నేతలకు తలనొప్పిగా మారింది. ఈ దఫా టిక్కెట్ ఇవ్వరని నిర్ధారించుకున్న మోదుగుల.. వైకాపాలో చేరాలని నిర్ణయించుకున్నారు.