1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 20 ఫిబ్రవరి 2020 (09:09 IST)

టీడీపీది పిచ్చి తుగ్లక్‌ యాత్ర: లక్ష్మీపార్వతి

టీడీపీది పిచ్చి తుగ్లక్‌ యాత్ర అంటూ వైసీపీ నేత లక్ష్మీపార్వతి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రచారం ఎప్పుడూ చూడలేదన్నారు.

డిపాజిట్లు కూడా రావనే చంద్రబాబు ప్రచారానికి వెళ్తున్నారని ఎద్దేవా చేశారు. ఐటీ దాడుల్లో అక్రమాస్తులు బయటపడుతుంటే.. చంద్రబాబు, లోకేష్‌కు దిక్కుతోచడం లేదని ఆరోపించారు.

టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు పనికిరారని... సమర్థులైన వారిని ఎన్నుకోవాలని ఆ పార్టీ నేతలే సూచిస్తున్నారన్నారు. చంద్రబాబు పాలన బాగుంటే అమరావతిలో ఎందుకు ఓడారు? అని ప్రశ్నించారు.
 
ఇలాంటి ఆరోపణలు టీడీపీ నేతలకు అలవాటు
తనకు భద్రత తగ్గించారని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలపై రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు.

చంద్రబాబు భద్రతలో ఎలాంటి మార్పులు చేయలేదని, ఒక్కరిని కూడా తగ్గించలేదని స్పష్టం చేశారు. ఆర్నెళ్లకొకసారి ఇలాంటి ఆరోపణలు చేయటం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు.

ప్రజల్లో సానుభూతి కోసం ఇలాంటి చవకబారు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన వ్యక్తిగత మాజీ కార్యదర్శి ఇంట్లో జరిగిన ఆదాయపన్ను శాఖ జరిపిన సోదాల గురించి మాట్లాడరు గానీ ఇలాంటి ఆరోపణలు మాత్రం చేస్తుంటారని చురక అంటించారు. చంద్రబాబు కోరితే ఆయనకు మరింత భద్రతను పెంచటానికి సిద్ధమని హోంమంత్రి ప్రకటించారు.